విజయవాడలో తీవ్ర కలకలం రేపిన రౌడీ షీటర్ సాయికృష్ణ మృతి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న నాగరాజును విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది. నిందితుడిని ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో ఉన్న నాగరాజును ఈ నెల 10వ తేదీ వరకు అక్కడే విచారించాలని కోర్టు స్పష్టం చేసింది.
Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!
ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలని పోలీసులకు గడువు విధించింది. ఈ విచారణ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరగాలని కోర్టు ఆదేశించింది. నిందితుడి న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని, దానికి సంబంధించిన ఆడియో మరియు వీడియోలను పూర్తిగా రికార్డ్ చేయాలని సూచించింది. విచారణ పూర్తయిన తర్వాత ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
ఈ 8 రోజుల కస్టడీ విచారణ పోలీసులకు అత్యంత కీలకంగా మారింది. సాయికృష్ణ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు, ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం అయినా ఉందా అనే కోణంలో పోలీసులు నాగరాజును ప్రశ్నించనున్నారు. ఈ విచారణ ముగిసిన తర్వాత పోలీసులు సమర్పించే నివేదిక ఆధారంగా ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగరాజుతో పాటుగా నలుగురి పోలీసులను అదుపులోకి తీసుకున్నారు.

