ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 2026 జూన్ నెలలో అద్భుతమైన విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లో ఎస్యూవీ మోడళ్లకు మరియు వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లకు ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా ఈ భారీ వృద్ధి నమోదైంది. గతేడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ మొత్తం వాహనాల విక్రయాలు ఏకంగా 37 శాతం వార్షిక వృద్ధిని సాధించి, 1,06,207 యూనిట్లకు చేరుకున్నాయి. మహీంద్రా ఆటోమొబైల్ చరిత్రలోనే ఒకే నెలలో ఒక లక్షకు పైగా వాహనాలను విక్రయించడం విశేషం.
Also Read : వాట్సాప్ కొత్త ఫీచర్ కు కేంద్రం బ్రేక్..!
మహీంద్రా కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే నెలలో ఎస్యూవీల విక్రయాలు 60 వేల మార్కును దాటాయి. 2026 జూన్లో 60,393 దేశీయ యుటిలిటీ వాహనాలను విక్రయించగా, ఇది గతేడాది జూన్ లో 47,306 యూనిట్లుతో పోలిస్తే 28 శాతం ఎక్కువ. ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ మహీంద్రా జోరు పెంచింది. కంపెనీ మొత్తం వాహనాల ఎగుమతులు ఏకంగా 125 శాతం పెరిగి.. గత ఏడాది జూన్ నాటి 2,634 యూనిట్ల నుండి ఈ ఏడాది 5,918 యూనిట్లకు చేరాయి. కస్టమర్ల నమ్మకం మరియు వైవిధ్యమైన పోర్ట్ఫోలియో వల్లే ఈ రికార్డు వృద్ధి సాధ్యమైందని మహీంద్రా ఆటోమొబైల్ విభాగం సీఈఓ నలినికాంత్ గొల్లగుంట హర్షం వ్యక్తం చేశారు.
Also Read : సీఎంఓలోకి మరో జగన్ అభిమాని..?
కేవలం ప్యాసింజర్ వాహనాలే కాకుండా వాణిజ్య, వ్యవసాయ విభాగాల్లోనూ మహీంద్రా మంచి పురోగతిని కనబరిచింది. 2 టన్నుల లోపు సామర్థ్యం ఉన్న తక్కువ బరువు రవాణా వాహనాల అమ్మకాలు 36 శాతం పెరగ్గా, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 63 శాతం వృద్ధితో 13,820 యూనిట్లకు చేరాయి. మరోవైపు, వ్యవసాయ రంగానికి వస్తే.. దేశీయ ట్రాక్టర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 58,177 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులతో కలిపి మొత్తం ట్రాక్టర్ల అమ్మకాలు 59,935 యూనిట్లకు చేరడంతో మహీంద్రా మార్కెట్ లీడర్ షిప్ మరింత పటిష్టంగా మారింది.

