తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం ప్రభుత్వాన్ని కూల్చేందుకు తెరవెనుక జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ అధికారులు ముందే పసిగట్టి భగ్నం చేశారు. రాష్ట్రంలో స్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా కొందరు రాజకీయ పెద్దలు ఈ వ్యూహాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ఈ ఉదంతం తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కుట్రలో భాగంగా అధికార పార్టీకి చెందిన దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఒక రహస్య ఆపరేషన్ నడిచినట్లు సమాచారం.
Also Read : ఎసిడిటీ, మలబద్ధకం సమస్యలా..? పెరుగు, మజ్జిగలలో ఏది బెస్ట్..?
వారికి భారీ ఎత్తున నగదుతో పాటు, భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తామంటూ ఎర వేశారు. పార్టీ ఫిరాయింపుల కోసం ఒక ప్రముఖ కన్సల్టెన్సీని కూడా రంగంలోకి దించినట్లు నిఘా వర్గాల దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు, ఒక కన్సల్టెన్సీ ఉన్నతాధికారితో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన మరో ఇద్దరిని కలిపి మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం కుట్ర వెనుక తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్బై.. ఇల్లు కూడా షిఫ్ట్..!
ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, వ్యూహాల వెనుక ఆయన కీలక సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ పలు రాజకీయ వివాదాల్లో ఉన్న ఆయన పేరు, ఇప్పుడు నేరుగా ప్రభుత్వంపై జరిగిన కుట్రలో వినిపించడం సంచలనంగా మారింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు జరిగిన ఈ కుట్రకు సంబంధించిన మూలాలను వెలికితీసేందుకు తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న ముగ్గురు నిందితులను రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఏయే రాజకీయ శక్తులు ఉన్నాయి..? వీరికి అందుతున్న ఫండింగ్ మూలాలు ఎక్కడివి..? అనే కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

