భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల టీమిండియా ఎదుర్కొన్న వరుస పరాజయాల నేపథ్యంలో గంభీర్ కోచింగ్ వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజీలాండ్, సౌతాఫ్రికా చేతిలో హోమ్ టెస్ట్ సిరీస్లలో ఘోర పరాజయాలు, అలాగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల టూర్లలో పేలవ ప్రదర్శనతో గంభీర్ను తొలగించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వ్యక్తమయ్యాయి. అయితే, తాజా నివేదికల ప్రకారం బీసీసీఐ గంభీర్ పదవికి ఎలాంటి ఢోకా లేదని, అతని స్థానం ప్రస్తుతానికి పూర్తిగా సురక్షితమేనని స్పష్టం చేసింది.
Also Read : గ్లోబల్ స్టేజీపై అమరావతి వైభవం..!
గంభీర్ను కొనసాగించడం వెనుక బోర్డు రెండు బలమైన కారణాలను పరిగణనలోకి తీసుకుంది. బీసీసీఐ గంభీర్ వైపు నిలబడటానికి మొదటి ప్రధాన కారణం.. ప్రస్తుతం భారత రెడ్-బాల్ క్రికెట్ జట్టు ఒక కీలకమైన మార్పుల దశ గుండా వెళుతుండటమే. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ పిల్లర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ దిగ్గజాలు ఇటీవల టెస్ట్ క్రికెట్కు గుడ్-బై చెప్పారు. ప్రస్తుతం కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఈ పరివర్తన సమయంలో ఫలితాలు ఆశించిన స్థాయిలో రాకపోయినా కోచ్ను బలిపశువును చేయడం కరెక్ట్ కాదని బోర్డు పెద్దలు భావిస్తున్నారు.
Also Read : ఎన్డీయే కన్వీనర్ గా సీఎం చంద్రబాబు..?
ఇక రెండవ పెద్ద అంశం.. కీలక ఆటగాళ్లను వెంటాడుతున్న గాయాలు. సౌతాఫ్రికాతో జరిగిన హోమ్ సిరీస్ మధ్యలో కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటమే పరాజయానికి ఒక కారణమని, ఒకవేళ గిల్ ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని బోర్డు నమ్ముతోంది. ప్రస్తుతం ప్రారంభం కానున్న శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు కూడా జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా దూరమయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో కోచ్ను బాధ్యుడిని చేయలేమని బీసీసీఐ అంగీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో, నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ను తాత్కాలికంగా టెస్ట్ కోచ్గా తెచ్చే ఆలోచనను కూడా బీసీసీఐ విరమించుకుంది. ఎందుకంటే ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భారత్కు కేవలం రెండు సిరీస్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక వైట్-బాల్ క్రికెట్ విషయానికి వస్తే.. గంభీర్ కనీసం 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా హెడ్ కోచ్గా కొనసాగడం ఖాయమని బోర్డు వర్గాల సమాచారం.

