దేశంలో మధుమేహం మహమ్మారిలా విస్తరిస్తోంది. ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం, దేశంలో దాదాపు 15.3 శాతం మంది వయోజనులు ప్రీడయాబెటిస్ దశలో ఉన్నారు. శరీరంలో ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా, అంటే 5.7% నుండి 6.4% మధ్యలో ఉండటాన్ని ప్రీడయాబెటిస్ అంటారు. అంటే వీరు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా త్వరగా టైప్-2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని, తక్షణమే జీవనశైలి మార్చుకోవాలని శరీరం ఇచ్చే ముందస్తు హెచ్చరిక ఇది.
Also Read : ఏపీలో ఐషర్ మోటార్స్ ఎంట్రీ.. భారీ పెట్టుబడి..!
వైద్య నిపుణుల ప్రకారం, సరైన వ్యాయామం ద్వారానే ప్రీడయాబెటిస్ను రివర్స్ చేయడం ఖచ్చితంగా సాధ్యమే. రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల శరీరంలోని కండరాలు గ్లూకోజ్ ను సమర్థవంతంగా వినియోగించుకుంటాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి, కణాలు ఇన్సులిన్ కు మెరుగ్గా స్పందిస్తాయి. ఈ దశను అధిగమించడానికి వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం అవసరం. అంటే వారంలో 5 రోజుల పాటు రోజుకు 30 నిమిషాల చొప్పున వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.
Also Read : టీమిండియాలో షమీ శకం ముగిసినట్లేనా..?
దీనితో పాటు వారానికి కనీసం రెండు రోజులు వెయిట్ ట్రైనింగ్ వంటి స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. సాధారణంగా వ్యాయామం ప్రారంభించిన కొన్ని వారాల్లోనే శరీరంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. రోజువారీ శారీరక శ్రమతో పాటు భోజనం చేసిన తర్వాత 10 నుండి 15 నిమిషాల పాటు నడవడం, బరువులో 5 నుండి 10 శాతం వరకు తగ్గడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు వేగంగా నియంత్రణలోకి వస్తాయి. అయితే ప్రతి ఒక్కరి శారీరక స్థితి ఒకేలా ఉండదు కాబట్టి, కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణలో సరైన పోషకాహారం తీసుకుంటే ప్రీడయాబెటిస్ ను మరింత సులభంగా, శాశ్వతంగా దూరం పెట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

