విదేశాలకు వెళ్లాలనుకునే భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన అలర్ట్ ఇచ్చింది. దేశంలో పాస్పోర్ట్ జారీ ప్రక్రియను మరింత ఆధునీకరించేందుకు వీలుగా భారత పాస్పోర్ట్ నిబంధనలలో కేంద్ర విదేశాంగ శాఖ పలు కీలక సవరణలు చేసింది. ఈ మేరకు పాస్పోర్ట్ నిబంధనలు పేరుతో నూతన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం పిల్లల సాధారణ పాస్పోర్ట్ చెల్లుబాటు కాలంలో మార్పులు చేయడంతో పాటు, వివిధ కేటగిరీల పాస్పోర్ట్ ఫీజులను కూడా సవరించారు.
Also Read : దేశంలోనే నెంబర్ వన్.. వైద్య రంగంలో ఏపీ సరికొత్త రికార్డు..!
తాజా నిబంధనల ప్రకారం, మైనర్లకు జారీ చేసే 36 పేజీల సాధారణ పాస్పోర్ట్ కాలపరిమితిలో మార్పు చేశారు. ఇకపై పిల్లల సాధారణ పాస్పోర్ట్ ఐదేళ్లు లేదా సదరు అభ్యర్థికి 18 ఏళ్లు నిండే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ రెండింటిలో ఏ గడువు ముందుగా ముగిస్తే దాని ఆధారంగానే ఆ పాస్పోర్ట్ వాలిడిటీ ముగిసినట్లుగా పరిగణిస్తారు. గతంలో ఉన్న వాలిడిటీ పరిమితులను సమీక్షిస్తూ, పిల్లల వయస్సును 18 ఏళ్లకు లింక్ చేస్తూ ప్రభుత్వం ఈ కీలక సవరణను ప్రవేశపెట్టింది. నూతన నిబంధనల ప్రకారం పాస్పోర్ట్ సేవల రుసుములు పెరిగాయి.
Also Read : వైసీపీలో విచిత్ర పరిస్థితి.. ఆదేశం ఉంది.. అభ్యర్థి ఎక్కడా..?
మారిన కొత్త ధరల వివరాలు చూస్తే.. పెద్దల కోసం జారీ చేసే సాధారణ 36 పేజీల పాస్పోర్ట్ ఫీజు రూ. 2,500 గా నిర్ణయించారు. అలాగే ఎక్కువ పేజీలు అవసరమయ్యే వారి కోసం జారీ చేసే 60 పేజీల జంబో పాస్పోర్ట్ ఫీజును రూ. 3,500 కు పెంచారు. ఇదే సమయంలో పిల్లల సాధారణ 36 పేజీల పాస్పోర్ట్ కొత్త దరఖాస్తు ఫీజును రూ. 1,750 గా ఖరారు చేశారు. పాస్పోర్ట్ ఫీజుల ధరలు పెరిగినప్పటికీ, సమాజంలోని నిర్దేశిత వర్గాలకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం యథాతథంగా కొనసాగించింది. ఎనిమిదేళ్ల లోపు వయసున్న పిల్లలు మరియు 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు కొత్త పాస్పోర్ట్ దరఖాస్తులపై ఇచ్చే 10 శాతం డిస్కౌంట్ నిబంధన ఎటువంటి మార్పు లేకుండా మునుపటిలాగే వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే, ఈ 10 శాతం రాయితీ కేవలం సరికొత్తగా తీసుకునే పాస్పోర్ట్లకే వర్తిస్తుందని, పాత పాస్పోర్ట్ పునరుద్ధరణ చేసుకునే వారికి ఇది వర్తించదని అధికారులు స్పష్టం చేశారు.

