స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక్కొక్క అడుగు పడుతోంది. అక్టోబర్ నెలాఖరు నాటికి ఎన్నికలు పూర్తి చేస్తామనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట. దీంతో అధికారులు కూడా ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం.. లోకల్ పోరులో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. అలాగే డీఎస్సీ పేరుతో అక్రమలు చేశారని.. ఇవి తమకు బాగా కలిసి వచ్చే అంశాలంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో మరో కీలక విషయాన్ని కూడా వైసీపీ నేతలే ప్రస్తావిస్తున్నారు. అదే కూటమిలో విభేదాలు.
Also Read : రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్కు ముచ్చెమటలు..!
కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. వీటిల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ ఉన్న తమకే ఎక్కువ సీట్లు కావాలనేది జనసేన పార్టీ నేతల మాట. ఇదే సమయంలో తమకే ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మెజారిటీ వాటా తమదే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో సీట్ల పంచాయతీపై ఇప్పటికే స్థానికంగా చాలా చోట్ల మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాలు, మేయర్, మునిసిపల్ స్థానాల విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీల్లో చేరిన నేతల సొంత నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది.
ఒంగోలు మేయర్ సీటుతో పాటు కార్పొరేటర్ల సీట్ల కోసం ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒంగోలు అసెంబ్లీ పరిధిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మధ్య తొలి నుంచి వైరం ఉంది. ఎన్నికల్లో ఈ ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్నారు. అదే సమయంలో ఆరోపణలు కూడా ఇరుపక్షాల నుంచి గట్టిగానే ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్గా జనసేన పార్టీలో చేరిపోయారు. దీంతో ఈ ఇద్దరి మధ్య వైరానికి బ్రేకులు పడతాయని అంతా భావించారు. కానీ బాలినేని జనసేనలో చేరి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ ఇద్దరి మధ్య వైరంలో ఎలాంటి మార్పు రాలేదు.
Also Read : ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ రెన్యూవల్కు కాసుల వర్షం..!
తాజాగా ఒంగోలు మేయర్ సీటు తమదే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. జనసేన పార్టీ తరఫున ఇప్పటికే నలుగురు ఐదుగురు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో కూడా మేయర్ అభ్యర్థుల జాబితా భారీగానే ఉంది. ఇదే సమయంలో వైసీపీ నుంచి బాలినేని వెంట జనసేనలో చేరిన నేతలు కూడా పదవులు ఆశిస్తున్నారు. దీంతో మేయర్ సీటు ఎవరికి దక్కుతుందనే చర్చ గట్టిగానే ఉంది. మేయర్ సీటుతో పాటు మెజారిటీ కార్పొరేషన్లు తమకే కావాలనేది ఇరు పార్టీల నేతల మాట. ఇదే సమయంలో మరో విషయం కూటమి నేతలను భయపెడుతోంది. తాము కోరిన సీటు ఇవ్వకపోతే.. రెబల్గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమనే మాట సన్నిహితుల వద్ద నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే.. కూటమి గెలుపు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు మేయర్ సీటు కోసమైనా, కార్పొరేటర్ల గెలుపు కోసమైనా సరే.. ఇరు పార్టీల నేతలు బాలినేని, దామచర్ల కలిసి ప్రచారం చేస్తారో లేక వేరు వేరుగా చేస్తారో చూడాల్సి ఉందంటున్నారు.

