కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా ఊరిస్తున్నారు. వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడు.. విజయసాయిరెడ్డి. కొత్త పార్టీ పెడుతున్నట్లు ఆయన చాలా రోజులుగా ప్రకటనలు ఇస్తున్నారు. ముందు దివ్యమైన శ్రావణ మాసంలో మన పార్టీ అన్నారు. శ్రావణం పోయింది.. ఇపుడు భాద్రపద మాసం శూన్యం కాబట్టి ఆశ్వియుజ మాసం అంటున్నారు. అంటే దసరా పండుగ అనేది సాయిరెడ్డి మాట. అంటే మరో నెల రోజుల్లో కొత్త పార్టీతో విజయసాయిరెడ్డి వస్తున్నారనేది ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రోజు.. ఇక రాజకీయాలకు సెలవు.. వ్యవసాయం చేసుకుంటా.. అని ప్రకటించిన సాయిరెడ్డి.. ఇప్పుడు తూచ్ అనేస్తున్నారు. మళ్లీ కొత్తగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువగా వైసీపీని ఫోకస్ చేస్తున్నప్పటికీ.. కాస్తా బాలెన్స్ చేస్తున్నట్లుగా టీడీపీని కూడా మధ్యలో కలుపుతున్నారు.
Also Read : 25 రోజుల తర్వాత ఏపీకి పవన్.. ఇప్పటి నుంచైనా ప్లీజ్..!
ఏపీలో ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అని ఆయన మహా కవి శ్రీశ్రీ గీతాన్ని పేరడిగా అందుకున్నారు సాయిరెడ్డి. అటు వైసీపీ ఇటు టీడీపీ దొందుకు దొందే అంటున్నారు. 2029లో టీడీపీ గెలిస్తే లోకేష్ సీఎం అని ఖాయం చేసేశారు ఈ మాజీ ఎంపీ. ఇక వైసీపీ గెలిస్తే జగన్ సీఎం అన్నది వేరేగా చెప్పాల్సింది లేదన్నారు. ఆ రెండు పార్టీలే ఆ పార్టీల అధినాయకత్వాలే బాగుపడుతున్నాయి.. కానీ ప్రజలకు ఏం ఒరిగింది అని ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు. వినేందుకు చర్చించేందుకు కూడా ఈ మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఇవే మాటలు విజయసాయిరెడ్డి దశాబ్దం పైగా వైసీపీలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు తెచ్చుకోలేదనే నెటిజన్లు అంటున్నారు.
ఏపీలో ఇప్పటి వరకు కేవలం కమ్మ, క్రైస్తవులు మాత్రమే ముఖ్యమంత్రి పదవులు అనుభవించారని.. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని కులాల వారికి సమానంగా అవకాశం ఉంటుందన్నారు. అదే సమయంలో తమదే అసలైన రెడ్డి పార్టీ అని ఫుల్ క్లారిటీతో చెప్పేశారు కూడా. ఇది కూడా బాగానే ఉంది. యువత ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని విజయసాయిరెడ్డి బలంగా కోరుకుంటున్నారు. తాను పెట్టబోయే పార్టీలో యువతకే ప్రాధాన్యత అని కూడా నమ్మకంగా చెబుతున్నారు. కానీ ఇంతకీ ఏపీలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి అవకాశం ఎంతవరకూ ఉంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న అంటున్నారు. పార్టీ పెడతాను అంటూనే ఆయన చాలా కాలంగా ప్రకటనలు ఇస్తున్నారు. తీరా పార్టీ పెట్టినా కూడా ఏపీలో అది నెట్టుకుని వచ్చి ఫోర్ ఫ్రంట్లో ఉండేది ఎట్లా అన్నది రాజకీయ విశ్లేషకుల సందేహం. మరి విజయసాయిరెడ్డికి కూడా ఈ విషయం మీద అవగాహన ఉండదా అని అంటున్నారు.
Also Read : బాంబు పేల్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే.. ఇంకా వైసీపీ వాసన పోలా..!
ఏ రాజకీయ పార్టీ సిధ్ధాంతాలు చూసినా.. అన్నీ మంచివే. అయితే ఆచరణలోనే తప్పటడుగులు పడుతున్నాయి. విజయసాయిరెడ్డి కూడా మంచి సిద్ధాంతాలే వల్లిస్తున్నారు. నా పార్టీలో నేను సీఎం క్యాండిడేట్ కాదు అంటున్నారు. యువతకి చాన్స్ అని ఊరిస్తున్నారు. బీసీలు, బడుగులకు సీఎం కుర్చీ ఎక్కే సీన్ లేదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఆయన మామూలు జనంలా మాట్లాడుతున్నారా అన్నదే ఇక్కడ అందరికీ కలిగే సందేహం. ఏపీలో రాజకీయం ఎట్టా నడుస్తుందో ప్రజలతో ఆయనకు కూడా తెలియదా అని అంటున్నారు. టీడీపీ, వైసీపీ చెరి 40 శాతం ఓటు షేర్తో బలంగా ఉన్న నేపధ్యం, మధ్యలో జనసేన కూడా ఉంది. ఇక ఇతర పార్టీలు బోలెడు ఉన్నాయి. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ వచ్చి ఎక్కడ ఎవరి స్పేస్ తీసుకుంటుంది, ఏ మేరకు రాణిస్తుంది అన్నదే పెద్ద అనుమానం. మొత్తానికి పార్టీ పెడతాను అని ప్రకటనలు ఇస్తూ వస్తున్నా పెద్దాయన ఎప్పుడు పని చేస్తారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు.

