ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ దృష్టి సారించింది. సార్వత్రిక ఎన్నికల విజయ పరంపరను స్థానిక సంస్థల్లోనూ కొనసాగించి, కూటమి జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదలాలని జనసేన అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం వేదికగా పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై కసరత్తు ప్రారంభమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పూర్తి సంసిద్ధంగా ఉండాలని జనసేన కీలక నేత, మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.
Also Read: కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ భూములపై రంగంలోకి రెవెన్యూ శాఖ..!
క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పొత్తు ధర్మాన్ని నిలబెడుతూ, మిత్రపక్షాలైన టీడీపీ, బిజెపి నాయకులను సమన్వయం చేసుకుంటూ కూటమి చారిత్రాత్మక విజయానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక మరియు సీట్ల సర్దుబాటు ప్రక్రియపై మంత్రి కందుల దుర్గేష్ స్పష్టతనిచ్చారు. స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల ఖరారు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
Also Read : దేశంలోనే నెంబర్ వన్.. వైద్య రంగంలో ఏపీ సరికొత్త రికార్డు..!
అధినాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని, సీట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి బేధాభిప్రాయాలకు తావులేకుండా కలిసికట్టుగా ముందుకు సాగాలని ఆదేశించారు. గత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వేధింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడిన జనసైనికుల పోరాట పటిమను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. నాటి ఎన్నికల్లో పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్యకర్తల, వీరమహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ.. ఈ ఎన్నికల్లో సమర్థులైన, అవినీతి మరియు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని క్లీన్ ఇమేజ్ ఉన్న నేతలను బరిలోకి దించుతామని స్పష్టం చేశారు. జనసేన బలమున్న స్థానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రత్యేక కార్యాచరణతో ఎన్నికల రేసులో దూసుకుపోతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

