హిందూ సంప్రదాయ వివాహాల చెల్లుబాటుపై గుజరాత్ హైకోర్టు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. హిందూ వివాహ చట్టం, 1955 లోని సెక్షన్ 7 ప్రకారం.. మతపరమైన సాంప్రదాయాలు, ముఖ్యంగా పవిత్ర అగ్ని సాక్షిగా ఏడు అడుగులు నడవకపోతే, కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేదా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్నంత మాత్రాన ఆ వివాహం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోకుండా, కేవలం కాగితాల మీద రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటే ఆ బంధానికి ఎలాంటి లీగల్ స్టేటస్ ఉండదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
Also Read : ముంబైకి హార్దిక్ పాండ్యా గుడ్బై.. ఇల్లు కూడా షిఫ్ట్..!
జస్టిస్ జె. వోరా, జస్టిస్ ఆర్.టి. వచ్ఛానిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ వివాహ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేసింది. “హిందూ సంప్రదాయంలో వివాహం అనేది కేవలం పాటలు-డాన్సులు, విందు వినోదాల కోసం చేసుకునే ఈవెంట్ కాదు. అలాగే ఇది ఒక వాణిజ్య ఒప్పందం కూడా కాదు. ఇది ఒక పవిత్రమైన సంస్కారం. మ్యాన్ అండ్ ఉమెన్ భవిష్యత్తులో ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి ఏర్పడే అత్యున్నత బంధం” అని కోర్టు పేర్కొంది. సెక్షన్ 7 ప్రకారం వివాహాన్ని సరైన పద్ధతిలో, నిర్దేశిత ఆచారాలతో పూర్తి చేసినప్పుడే చట్టం ముందు దానికి గుర్తింపు లభిస్తుందని గుర్తుచేసింది.
Also Read : ఎల్నినో ఎఫెక్ట్.. అత్యంత పొడి జూన్..!
బ్రిటన్ లో ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడికి సంబంధించి దాఖలైన కేసులో హైకోర్టు ఈ సంచలన తీర్పును ఇచ్చింది. సదరు వ్యక్తికి, ఒక మహిళకు మధ్య ఎలాంటి సాంప్రదాయ వివాహం జరగలేదని స్వయంగా మహిళే అంగీకరించినప్పటికీ.. గతంలో ఫ్యామిలీ కోర్టు కేవలం మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధారంగా పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది. దీనిని తప్పుపట్టిన గుజరాత్ హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆ వివాహాన్ని మొదటి నుంచీ చెల్లనిదిగా ప్రకటించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 8 కింద ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది.. కేవలం సెక్షన్ 7 ప్రకారం అంతకుముందే జరిగిన పక్కా పెళ్లికి ఒక అదనపు డాక్యుమెంటరీ ఆధారమే తప్ప, అసలు పెళ్లి ఆచారాలే జరగనప్పుడు ఆ సర్టిఫికెట్ చట్టబద్ధతను తీసుకురాలేదని హైకోర్టు తేల్చిచెప్పింది.

