దేశంలో ఈ ఏడాది జూన్ నెల గత వందేళ్లలో నమోదైన మూడో అత్యంత పొడి జూన్గా నిలిచే పరిస్థితి నెలకొంది. జూన్ నెల ముగియడంతో దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 42 శాతానికి చేరింది. ఈ పరిణామం భారత్లో నైరుతి రుతు పవనాలపై ఎల్నినో ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనట్లు సంకేతాలు ఇస్తోందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత వాతావరణ శాఖ.. ఐఎండీ గణాంకాల ప్రకారం, జూన్ నెలలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సగటున 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 157.7 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాలి. నెల చివరి రోజుల్లో మంచి వర్షాలు కురిసినా, మొత్తం జూన్ వర్షపాతం సుమారు 100 మిల్లీమీటర్ల వద్దే ముగిసినట్లు అధికారులు తెలిపారు.
Also Read : వాట్సాప్ లో ఫోన్ నంబర్ పని లేదా..?
1927 నుంచి 2026 వరకు వందేళ్ల రికార్డులను పరిశీలిస్తే, దీనికంటే తక్కువ వర్షపాతం నమోదైన జూన్ నెలలు కేవలం రెండే. 2009లో 87.5 మిల్లీమీటర్లు, 2014లో 92.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది జూన్ వందేళ్లలో మూడో అత్యంత పొడి నెలగా నమోదైంది. ఈ నెలలో అత్యధికంగా మధ్య భారతంలోనే 54 శాతం వర్షా భావం నమోదైంది. తూర్పు, ఈశాన్య భారతంలో 41 శాతం, వాయువ్య భారతంలో 30 శాతం, దక్షిణ భారతంలో 28 శాతం వర్షపాతం లోటు ఉంది. దేశంలోని నాలుగు ప్రధాన భౌగోళిక ప్రాంతాల్లో ఒకేసారి ఇంత భారీ వర్షాభావం నమోదు కావడం అరుదైన పరిణామంగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే, జులై తొలి వారంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో విస్తృతంగా, సమానంగా వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా ఇప్పటివరకు అత్యధిక లోటు నమోదైన మధ్య భారతంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ అండ్ సొసైటీ.. ఐఆస్ఐ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, భూమధ్యరేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఎల్నినో మధ్యస్థ తీవ్రతకు చేరువలో ఉండగా, రానున్న నెలల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read : సునీల్ కుమార్ రిటైర్మెంట్ వేడుకలు.. పొలిటికల్ ఎంట్రీపై రేపే ప్రకటన..?
ఎల్నినో తీవ్రత పెరిగే కొద్దీ భారత నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం అధికమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 4న కేరళలో బలహీనంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో చురుకుదనం ప్రదర్శించలేదు. జూన్ నెలలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సాధారణాన్ని మించిన వర్షపాతం నమోదైన రోజు ఒక్కటే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

