దేశంలో కరోనా, నిపా వంటి వైరస్ల భయాలు ఇంకా పూర్తిగా తొలిగిపోకముందే, ఇప్పుడు మరో ప్రాణాంతక వైరస్ ప్రజలను వణికిస్తోంది. గుజరాత్ లో చండీపురా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ భయంకర వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మరణించడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నపిల్లలపై ఈ వైరస్ పంజా విసురుతోంది. ప్రస్తుతం గుజరాత్ లోని పలు జిల్లాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 35 మందికి పైగా ఈ వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
Also Read : జగన్ పర్యటన దెబ్బ.. ధర్మాన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
వైరస్ బారిన పడిన వారిలో ఏడుగురు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారిని ఐసీయూ లో ఉంచి ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా 14 ఏళ్ల లోపు వయసు ఉన్న చిన్నారులు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ వైరస్ ప్రధానంగా శాండ్ ఫ్లై అంటే ఇసుక ఈగలు.. అనే ఒక రకమైన చిన్న ఈగలు లేదా దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. పశువుల పాకలు, మట్టి గోడలు, మురికిగా ఉండే ప్రాంతాలలో ఈ ఈగలు ఎక్కువగా పెరుగుతాయి.
Also Read : బ్రేకింగ్: విజయ్ పై కామెంట్స్.. స్టాలిన్ అరెస్ట్..!
ఇవి కుట్టడం వల్ల వైరస్ నేరుగా రక్తంలోకి ప్రవేశించి, రోగి మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల తీవ్రమైన జ్వరం, వాంతులు, తలనొప్పి, ఫిట్స్ రావడం మరియు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండటంతో గుజరాత్ ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యాయి. వైరస్ ప్రభావిత గ్రామాలలో యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. శాండ్ ఫ్లై ఈగలను నిర్మూలించడానికి గ్రామాల్లోని ఇళ్లు, పశువుల కొట్టాలు మరియు వీధుల్లో పెద్ద ఎత్తున క్రిమిసంహారక మందులు, దోమల నివారణ మందులను పిచికారీ చేస్తున్నారు.

