గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశ యాప్, ప్రత్యేక పోలీస్ స్టేషన్ల పేరుతో విపరీతమైన ప్రచార ఆర్భాటం జరిగిన సంగతి తెలిసిందే. యాప్ డౌన్లోడ్ ల కోసం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించి పెద్ద ఎత్తున హడావుడి చేసినా, క్షేత్రస్థాయిలో మహిళలపై దాడులు, అరాచకాలు ఆగలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలాంటి అనవసర పబ్లిసిటీ స్టంట్లు, కోట్ల రూపాయల ప్రకటనల జోలికి వెళ్లకుండా, కేవలం చేతల్లోనే మహిళల భద్రతను నిరూపిస్తూ క్షేత్రస్థాయిలో సైలెంట్ విప్లవాన్ని నడుపుతోంది.
Also Read : రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు: హైకోర్ట్ సంచలన తీర్పు
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం 164 శక్తి బృందాలను రంగంలోకి దించింది. ఇవి కేవలం కాగితాలకే పరిమితం కాకుండా నిరంతరం క్షేత్రస్థాయిలో పహారా కాస్తున్నాయి. ఏపీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ప్రత్యేక చర్యల వల్ల రాష్ట్రంలో మహిళలపై నేరాలు 15.5% మేర తగ్గాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రచారం ఎక్కువ.. ఫలితం తక్కువ అనే చందంగా సాగగా, ఇప్పుడు ప్రచారం లేకపోయినా నేరాల రేటు గణనీయంగా తగ్గడం కూటమి ప్రభుత్వ పటిష్టమైన హోం శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కేవలం యాప్ ల ప్రచారానికే పరిమితం కాకుండా, తప్పిపోయిన మరియు అపహరణకు గురైన మహిళలు, బాలికల ప్రాణాలను కాపాడటంలో ఏపీ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా గత 10 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 9,120 మంది మహిళలు, బాలికల ఆచూకీని విజయవంతంగా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత తక్కువ కాలంలో ఇంతమంది ఆచూకీ కనుగొనడం కూటమి ప్రభుత్వ అంతర్గత నిఘా, పోలీసు వ్యవస్థకు ఉన్న స్వేచ్ఛను ప్రతిబింబిస్తోంది.
Also Read : వెస్పా లిమిటెడ్ వెర్షన్ కేక.. అదిరిపోయే ఫీచర్లు..!
కూటమి ప్రభుత్వం పెద్దగా ప్రకటనలు గుప్పించకపోయినా, ప్రజల్లో నమ్మకం పెరగడంతో శక్తి యాప్ ఏకంగా 1.55 కోట్ల డౌన్లోడ్ లను దాటింది. కేవలం డౌన్లోడ్ ల సంఖ్యే కాదు, అత్యవసర సమయాల్లో ఈ యాప్ అద్భుతంగా పనిచేస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 41,106 ఎస్ఓఎస్ కాల్స్ కు శక్తి బృందాలు అత్యంత వేగంగా స్పందించి మహిళలకు తక్షణ రక్షణ కల్పించాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మహిళలు, ప్రజలు వెంటనే 112 నంబర్ కు కాల్ చేయాలని ఏపీ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాల కంటే ఫలితాలే ముఖ్యమని నమ్మే కూటమి సర్కార్, మహిళా రక్షణలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.

