టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం శరవేగంగా పెరుగుతోంది. ఈ తరుణంలో ఏఐ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఒక సంచలనాత్మక ఒప్పందం కుదిరింది. ఆసియా పసిఫిక్ ప్రాంతపు అగ్రగామి ఏఐ కనెక్టివిటీ ప్లాట్ ఫారమ్.. లైట్స్టార్మ్ ఒక భారీ సబ్మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్ ను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, సింగ్ టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఈ కేబుల్ వ్యవస్థకు ‘I-2SEA’.. ఇండియా – సౌత్ ఈస్ట్ ఏషియా అని పేరు పెట్టారు.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
ఈ సరికొత్త సబ్మెరైన్ కేబుల్ వ్యవస్థను కేవలం సాధారణ ఇంటర్నెట్ కోసం కాకుండా, భారీ ఏఐ డేటా లోడ్ లను మోయడానికి వీలుగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. హైపర్ స్కేలర్లు, జీపీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్లు మరియు ఏఐ ట్రైనింగ్ రన్ చేసే పెద్ద పెద్ద పరిశ్రమల అవసరాలను తీర్చడమే దీని ముఖ్య ఉద్దేశం. దాదాపు 3600 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ కేబుల్, భారత్ – ఆగ్నేయాసియా ప్రాంతాల మధ్య అత్యంత వేగవంతమైన డేటా ట్రాన్స్మిషన్ ను అందిస్తుంది.
Also Read : వాట్సాప్ కొత్త ఫీచర్ కు కేంద్రం బ్రేక్..!
ఈ ‘I-2SEA’ కేబుల్ వ్యవస్థ సింగపూర్ మరియు మలేషియాల్లోని కౌలాలంపూర్ డేటా సెంటర్లను నేరుగా భారతదేశ తూర్పు తీరంతో కలుపుతుంది. దీని కోసం భారత్ లో రెండు చోట్ల ల్యాండింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో మొదటిది ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం. ఇక్కడి నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఏఐ, డేటా సెంటర్ క్లస్టర్లకు అత్యంత తక్కువ దూరంలో సబ్సీ కనెక్టివిటీ లభిస్తుంది. రెండవ ల్యాండింగ్ పాయింట్ ను సౌత్ చెన్నైలో ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : లేటుగా గుర్తొచ్చిన ముద్రగడ.. వేడి తట్టుకోలేకే జగన్ హైదరాబాద్ పర్యటన..?
ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను గ్లోబల్ లీడర్ ‘ఎన్ఈసి కార్పొరేషన్ కు అప్పగించగా, సముద్రంలో కేబుల్ వేసే బాధ్యతను ‘ఏఎస్ఈఏఎన్ కేబుల్ షిప్ సంస్థ చూసుకుంటుంది. సముద్ర గర్భంలో దాదాపు 3 మీటర్ల లోతులో ఈ కేబుళ్లను పాతిపెట్టడం ద్వారా వీటికి గరిష్ట రక్షణ మరియు అప్-టైమ్ లభిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టును 2029 చివరి త్రైమాసికం నాటికి పూర్తి చేసి, సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

