తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత సర్వసత్తాక నాయకుడు ఎవరు అంటే రెండో మాట లేకుండా చెప్పే పేరు నారా లోకేష్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. పార్టీలో కీలకమైన నిర్ణయాలలో లోకేష్ పాత్ర ఉంటోందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక ప్రభుత్వంలో లోకేష్ పాత్ర ఎంత ఏమిటి అంటే టీడీపీకి 20 మంది మంత్రులు ఉన్నారు. అందులో లోకేష్ కాక పందొమ్మిది మంత్రులతో లోకేష్ సొంతంగా సమావేశాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని వస్తే ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ మంత్రులు ఆయనతో సమావేశాలు జరిపిన నేపథ్యం కూడా ఉంది.
Also Read : ఇంటింటికి తెలుగుదేశం క్రేజీ రికార్డ్..!
నియోజకవర్గాల పర్యటనలో కూడా లోకేష్కు పార్టీ శ్రేణులు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీలో ప్రభుత్వంలో అలా లోకేష్ పాత్ర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే లోకేష్ను టీడీపీ నేతలు, కార్యకర్తలు కాబోయే సీఎంగానే చూస్తున్నారు. అయితే అది కూడా ఇప్పుడు కాదని 2029 ఎన్నికల తరువాత అనేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే అనూహ్యంగా ఒక పుకారు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది. లోకేష్కు తొందరలోనే పట్టాభిషేకం జరుగుతుందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. ఈ డిసెంబర్ నాటికి రెండున్నరేళ్లు అవుతుంది.. అంటే సగం పాలన పూర్తి అయినట్లు అన్న మాట. ఆ సమయానికి లోకేష్ను ముఖ్యమంత్రిగా చేసే ప్రతిపాదన అయితే టీడీపీలో సీరియస్గానే సాగుతోంది అని అంటున్నారు. దీని కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్లో నిర్వహించి ఒక కీలక ఘట్టాన్ని ముగిస్తారని అంటున్నారు. ఆ తరువాత లోకేష్కు పట్టాభిషేకం జరుగుతుందని, దాని కోసం శుభ ముహూర్తాన్ని సిద్ధం చేసి ఉంచారని కూడా అంటున్నారు.
నిజానికి ఇది ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద సంచలన కలిగించే అంశం. దేశంలో చాలా చోట్ల తండ్రుల తరువాత తనయులు రాజకీయంగా చురుగ్గా ఉంటూ అధికార పదవులు చేపట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమికి 2024లో 164 సీట్లు వచ్చాయి. అందులో జనసేన 21, బీజేపీ ఎనిమిది తీసేస్తే టీడీపీకే సొంతంగా 135 సీట్లు ఉన్నాయి. మొత్తం 175 మంది ఉన్న అసెంబ్లీలో ఇది బాహుబలి మార్క్ మెజారిటీ. మరి ఇంతటి మెజారిటీ ఉన్నప్పుడు టీడీపీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏమైనా చేయవచ్చు. అయితే కూటమి పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకుని మసలుకోవడం కోసమే ఇన్నాళ్ల జాప్యం అని అంటున్నారు.
Also Read : విజయ్ ఇంటి పక్కనే త్రిష కొత్త ఇల్లు..?
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ ఈ దిశగా ఆలోచన చేస్తోంది అని కాపునాడు నాయకుడు దాసరి రాము చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. తనకు ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని అన్నారు. తెలంగాణాలో కేటీఆర్ను సీఎంగా కేసీఆర్ సరైన సమయంలో చేయలేకపోయారని.. అలాగే యూపీయే ప్రభుత్వం రెండు సార్లుఅధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా తప్పు చేశారని అలాంటి పొరపాట్లు జరగకుండా టీడీపీ ముందుగానే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోందని రాము వ్యాఖ్యానించారు.
అయితే ఈ ప్రచారం ఇప్పటికే చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కేంద్రంలో మోడీ కూడా లోకేష్ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు. ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ తరువాత ఆయన లోకేష్ భుజం తట్టిన తీరుని అంతా చూశారు. అంతకు ముందు కూడా ఆయన యువనేత లోకేష్ సామర్థ్యాన్ని మెచ్చుకున్నారని చెబుతారు. ఈ నేపథ్యంలో లోకేష్ పగ్గాలు అందుకోవడానికి అయితే సరిగ్గా ఇదే సరైన ముహూర్తం అన్న మాట కూడా ఉంది. మరి ఈ పుకార్లు ఏ మేరకు నిజం అవుతాయి అన్నది చూడాల్సి ఉంది.

