ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ లోని నిందితుల నివాసాల్లో కీలక పత్రాల కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ప్రధానంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తుల ఇళ్లు ఉన్నాయి.
Also Read : రంగంలోకి ఫేక్ గాళ్లు.. కూటమి సర్కార్ బీ అలర్ట్..!
వీరితో పాటు జగన్ మాజీ ఓఎస్డీ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఈ కేసులో ఏ1గా ఉన్న.. రాజ్ కెసిరెడ్డి వంటి నిందితుల ఇళ్లలోనూ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వీరందరూ మద్యం పాలసీ రూపకల్పన, అమలులో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దారిమళ్లించడం, డిజిటల్ పేమెంట్లను కాకుండా కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరపడం ద్వారా భారీగా అవినీతి జరిగినట్లు ఈడీ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించింది.
Also Read : వాట్సాప్ యూనివర్సిటీపై సుప్రీం సంచలన కామెంట్స్..!
ఈ మేరకు ఇప్పటికే చార్జ్ షీట్ ను కూడా దాఖలు చేసిన అధికారులు, తాజా సోదాల ద్వారా మరిన్ని ఆధారాలను, హవాలా లింకులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోని చెవిరెడ్డి భాస్కరరెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లో జరుగుతున్న సోదాలతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 2024 ఎన్నికల తర్వాత ఈ స్థాయిలో ఈడీ దాడులు జరగడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ కేసు తదుపరి ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : పెట్రో మంట.. ఎన్నికలు పూర్తి కాగానే లీటరుకు రూ. 25..?
సోదాల నేపథ్యంలో నిందితుల నివాసాల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. మద్యం కుంభకోణం కేసులో కీలకమైన మనీ లాండరింగ్ కోణాన్ని ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్లు మరియు సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులను త్వరలోనే విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో పాలన మారిన తర్వాత కేంద్ర సంస్థలు ఇలా దూకుడు పెంచడంపై రాజకీయంగా చర్చ మొదలైంది. మరి ఈ సోదాల్లో ఎలాంటి కీలక ఆధారాలు దొరుకుతాయో వేచి చూడాలి.

