దేశంలో కొనసాగుతున్న ఎన్నికల హడావిడి ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, ఆ భారాన్ని సామాన్యులపై వేయడానికి ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 29న చివరి విడత పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుండే ఈ వడ్డింపు మొదలయ్యే ఛాన్స్ ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read : పిఠాపురంలో రగులుతున్న కూటమి, వర్మ సంచలన ట్వీట్..!
సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలు పెంచడం ప్రభుత్వాలకు ఇబ్బందికరమైన విషయం. అందుకే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, గత కొంతకాలంగా దేశీయంగా రేట్లు పెంచకుండా చమురు సంస్థలు నిలిపివేసాయి. ప్రముఖ ఆర్థిక సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం.. ప్రస్తుత అంతర్జాతీయ ధరల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఎన్నికల కోడ్, పోలింగ్ ముగియడమే తరువాయి అని తెలుస్తోంది.
Also Read : పిఠాపురంలోనే ఎందుకు ఆ సమస్య..?
ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల మార్కును దాటిపోయింది. దేశీయ చమురు సంస్థల నష్టాలను లెక్కిస్తే.. పెట్రోల్.. లీటరుకు సుమారు రూ. 20 నుండి రూ. 28 వరకు పెరగాల్సి ఉంది. డీజిల్.. లీటరుకు సుమారు రూ. 25 పైనే పెరిగే అవకాశం ఉంది. అయితే, ఒకేసారి ఇంత భారం వేయకుండా దఫదఫాలుగా రోజుకు 50 పైసల నుండి 1 రూపాయి వరకు పెంచుతూ వెళ్తారని సమాచారం. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సతమతమవుతున్న సామాన్యుడికి, ఇంధన ధరల పెరుగుదల మరింత భారంగా మారనుంది. డీజిల్ రేట్లు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్నంటుతాయి. ప్రభుత్వం ఒకవేళ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఉపశమనం కలిగిస్తే తప్ప, ఈ పెట్రో షాక్ నుండి తప్పించుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

