వైసీపీ పరిస్థితి ఎలా ఉంది.. అంటే.. ఒకటే సమాధానం. ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ.. క్రమంగా బలం పుంజుకుంటున్నట్లు పైకి ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. వైసీపీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. వైసీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని.. రాబోయే ఎన్నికల్లో మాదే అధికారమని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ గొప్పగా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ల మధ్య పెద్ద వైరం నడుస్తున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.
Also Read : ఆ విషయంలో మోదీ సైలెన్స్.. కాంగ్రెస్ ఫైర్..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు విభేదాలు పతాక స్థాయికి చేరినట్లు టాక్ నడుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి ఆ ఇద్దరు నేతల విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నట్లు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొన్నటి ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అదే సమయంలో రోజాతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి మాట నడిచేది. రాయలసీమలో సైతం ఆయన హవా ఉండేది. అటువంటిది ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత.. పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Also Read : బందరు టూ సింగపూర్.. భారత్కు AI సూపర్ హైవే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి హవా అంతా ఇంతా కాదు. ఏకంగా కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో సొంత పార్టీ వారు సైతం ఆయన కనుసన్నల్లో ఉండాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పేవి కావు. అందుకే అప్పట్లో ఆర్కే రోజాతో పాటు చెవిరెడ్డి లాంటి నేతలు పెద్దిరెడ్డి విషయంలో చాలా గౌరవభావంతో ఉండేవారు. దానికి ప్రధాన కారణం భయం. అయితే ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత పెద్దిరెడ్డి విషయంలో వైసీపీ నేతల తీరు మారింది. ప్రధానంగా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రాయలసీమను చూసేవారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వెంట నిత్యం తాడేపల్లి కార్యాలయంలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు పుణ్యమా అని జగన్ మోహన్ రెడ్డి విషయంలో పెద్దిరెడ్డి వైఖరి మారినట్లు ప్రచారంలో ఉంది. ఇదే అదునుగా భావించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు దగ్గరైనట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డి ఫ్యామిలీ విషయంలో చెవిరెడ్డి ఇస్తున్న సమాచారాన్ని జగన్ కూడా నమ్ముతున్నారని పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది.

