శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన ఉదంతంలో ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో స్థానిక పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర దుమారం రేగిన సంగతి కుడా తెలిసిందే. దీంతో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ సునీల్ పై బదిలీ వేటు పడింది. ఈ కేసు దర్యాప్తులో తీవ్ర అలసత్వం ప్రదర్శించారన్న అభియోగాలపై ఎస్ఐ సునీల్ ను వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన రాత్రి గస్తీలో ఉన్న ఎస్ఐ సునీల్, రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని తన సిబ్బందితో కలిసి స్వయంగా పరిశీలించారు.
Also Read : ఐకాన్ స్టార్ బాక్సాఫీస్ వేట.. పాన్ ఇండియా డామినేషన్ కు క్రేజీ ప్లాన్..!
అయితే ఆ సమయంలో బాధితుడికి న్యాయం చేయడంలో విఫలమవ్వడం, కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయానికొస్తే, ప్రమాదం జరిగిన రాత్రి ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్ఐ సునీల్.. సదరు ప్రమాదానికి కారకులైన వారి మాటలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు తేలింది. బాధితుడి వైపు నుండి కాకుండా నిందితుల వెర్షన్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక గొర్రెల కాపరి ప్రాణం పోయిన ఘటనలో కనీస ప్రాథమిక సూత్రాలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం డిపార్ట్మెంట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : కూటమిలో లోకల్ వార్ టెన్షన్..!
ఈ అలసత్వాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ, శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఎస్ఐని తక్షణమే వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ వేటుతో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుడు దానయ్య మృతికి కారణమైన అసలు నిందితులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, ఇలాంటి క్లిష్టమైన కేసుల్లో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దానయ్య కుటుంబానికి న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని బాధిత కుటుంబం కోరుతోంది.

