ముంబై-అహ్మదాబాద్ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంపై భారత్, జపాన్ మధ్య సరికొత్త వివాదం చెలరేగింది. ఈ ప్రాజెక్ట్ ఆలస్యానికి భారత అధికారుల నిర్లక్ష్యం, స్వార్థమే కారణమంటూ జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడెకి మకిహారా సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. చర్చల సమయంలో భారత అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షించిన భారత మంత్రి వైఖరి అత్యంత ఘోరంగా ఉందని ఆయన విమర్శించారు.
Also Read : దుబాయ్ లో ఫ్యూచర్ లేదా..? ఇండియన్స్ నానా కష్టాలు..!
సిగ్నలింగ్ వ్యవస్థ నుండి జపాన్ ను భారత్ కావాలనే మినహాయించిందని, ఈ ప్రాజెక్ట్ మూల రూపం అయిన షింకాన్సెన్ మోడల్ దెబ్బతినడానికి 100 శాతం భారత ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు. అయితే, జపాన్ మాజీ మంత్రి చేసిన ఈ ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ఇవి నిజాలకు చాలా దూరంగా ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి భారత్-జపాన్ మధ్య చర్చలు, పనులు ఎంతో విజయవంతంగా, వేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు.
Also Read : పెరుగుతున్న నిరుద్యోగం.. భయపెడుతున్న నో జాబ్స్..!
సిగ్నలింగ్ పరికరాలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే ఆర్డర్లు ఇచ్చామని, ఈ విషయంలో జపాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటున్నాయని కేంద్రం వెల్లడించింది. గుజరాత్లోని సూరత్ మరియు బిలిమోరా మధ్య నిర్మించిన మొదటి విభాగాన్ని 2027 ఆగస్టు 15 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. జపాన్ అభివృద్ధి చేస్తున్న సరికొత్త E10/E20 సిరీస్ రైళ్లు 2030 నాటికి అందుబాటులోకి వస్తాయని, అప్పటివరకు ఇరు దేశాల ఉమ్మడి అంగీకారంతోనే పనులు ముందుకు సాగుతున్నాయని భారత్ ప్రకటించింది. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.

