అమెరికా-ఇరాన్ మధ్య సాగుతున్న అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులను తీవ్రంగా కదిలించివేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ క్షిపణులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైపు దూసుకురావడంతో ఆ దేశంలో భయంకరమైన ఉద్యోగ సంక్షోభం ముంచుకొచ్చింది.. ఈ యుద్ధ భయాల వల్ల దుబాయ్కు ప్రధాన ఆర్థిక వనరులైన టూరిజం మరియు ఏవియేషన్ రంగాలు ఇప్పుడు పూర్తిగా పడకేశాయి. విదేశీ పర్యాటకులు, పెట్టుబడులపై ఆధారపడే వందలాది వ్యాపారాలు మూతపడటంతో అక్కడ మార్కెట్ అంతా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది.
Also Read : మాజీ మంత్రి కోసం ఎస్సై రిస్క్.. ఎస్పీ రిటర్న్ గిఫ్ట్..!
ఫలితంగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దుబాయ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రోజురోజుకూ కంపెనీల్లో ఉద్యోగాల కోత విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం అక్కడ వ్యాపారాలు లేకపోవడంతో కేటరింగ్, సర్వీస్, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు తమ సిబ్బందిని విచక్షణారహితంగా తీసేస్తున్నాయి. ఎంతో మంది భారతీయ యువకులు చేతిలో రెజ్యూమ్లు పట్టుకుని కొత్త కొలువుల కోసం కంపెనీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు.
Also Read : ‘రాకా’ షూటింగ్లో దీపికా డెడికేషన్..!
అక్కడ పరిస్థితులు చూస్తుంటే కొత్త ఉద్యోగాలు దొరకడం పక్కన పెడితే, రోజువారీ మనుగడ సాగించడమే ఒక పెద్ద సవాలుగా మారింది. అదృష్టవశాత్తూ కంపెనీల్లో ఉద్యోగాలు నిలబెట్టుకున్న వారికి సైతం యాజమాన్యాలు జీతాలను సగానికి సగం తగ్గించి షాక్ ఇస్తున్నాయి. రూమ్ రెంట్లు కట్టలేక, తిండికి కూడా డబ్బులు లేక వలస కార్మికులు అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణనాతీతంగా మారుతోంది. ఈ గల్ఫ్ సంక్షోభం తీవ్రత దుబాయ్కే పరిమితం కాకుండా, వలసదారుల డబ్బు పైనే ఆధారపడి బ్రతుకుతున్న భారత్లోని లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితిని అగమ్యగోచరంగా మార్చింది.

