భారత పురుషుల క్రికెట్ జట్టు కోచింగ్ స్టాఫ్లో తీవ్ర సంక్షోభం నెలకొందా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ టీంలో కీలక సభ్యుడిగా ఉన్న అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోస్కాట్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తనకు ఇచ్చిన ఒక హామీని మేనేజ్మెంట్ నిలబెట్టుకోకపోవడం వల్లే నెదర్లాండ్స్ కు చెందిన ఈ మాజీ క్రికెటర్ టీమ్ ఇండియాను వీడాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే తన నిర్ణయాన్ని భారత జట్టు యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Also Read : స్టార్ హీరో మూడో పెళ్లిపై మతం రచ్చ.. అసలేం జరిగింది..?
టెన్ డోస్కాట్ అసంతృప్తికి జట్టులోని ఫీల్డింగ్ కోచ్ పదవికి సంబంధించిన వివాదమే ప్రధాన కారణమని తెలుస్తోంది. గంభీర్ ఆధ్వర్యంలో అతను అసిస్టెంట్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో, జట్టు ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు కూడా అప్పగిస్తామని హామీ ఇచ్చారట. అయితే, గతంలో రాహుల్ ద్రావిడ్ హయాం నుండి ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగుతున్న టి. దిలీప్ను ఆ పదవి నుంచి తొలగించకపోగా, ఆయన పదవీకాలాన్ని పొడిగించారు. జట్టులో సీతాన్షు కోటక్, గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ విభాగాలను, మోర్నీ మోర్కెల్, సాయిరాజ్ బహుతులే బౌలింగ్ విభాగాలను పర్యవేక్షిస్తుండటంతో, దిలీప్ ఉన్న కారణంగా టెన్ డోస్కాట్ నైపుణ్యాలను జట్టు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read : భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..!
వాస్తవానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టి. దిలీప్తో పాటు మరికొందరు సహాయక సిబ్బందిని తొలగించాలని బోర్డు భావించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ, జట్టులోని ఒక సీనియర్ ఆటగాడి నుంచి వచ్చిన బలమైన సిఫార్సు కారణంగా దిలీప్ కు మరో ఏడాది పాటు పొడిగింపు లభించింది. దీనివల్ల తనకు లభించాల్సిన ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన టెన్ డోస్కాట్, ఒప్పంద కాలం ముగియక ముందే తప్పుకోవాలని చూస్తున్నారు. ఈ వివాదంపై స్పందించి, ఆయనను జట్టులోనే కొనసాగేలా అనుమతించాలా లేదా అనే అంశంపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

