తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన శైలిలో పాలన సాగిస్తున్న విజయ్.. తాజాగా జరిగిన రెండవ కేబినెట్ సమావేశంలో మంత్రులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు ఎలాంటి చోటు ఉండకూడదని ఆయన చాలా స్పష్టంగా ఆదేశించారు. ఎవరైనా సరే అవినీతి ఆరోపణలకు పాల్పడి, అవి రుజువైతే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వారి మంత్రి పదవులను తక్షణమే రద్దు చేస్తామని సీఎం విజయ్ హెచ్చరించడం ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
Also Read : బాలయ్య బాక్సాఫీస్ స్టామినా ఓ రేంజ్ లో..!
పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో సీఎం విజయ్ స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు తమకు తెలిసిన వారైనా, తెలియని వారైనా సరే తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ఇటీవల టీవీకే పార్టీ నేత ఒకరు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వెంటనే వేటు వేసిన ఘటనను గుర్తుచేస్తూ, పార్టీలోనే కాదు ప్రభుత్వంలోనూ అదే క్రమశిక్షణను కొనసాగిస్తానని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కేబినెట్ భేటీలో సీఎం విజయ్ మంత్రులకు మరో సంచలన ఆదేశాలు జారీ చేశారు.
Also Read : గల్లా జయదేవ్ కు లోకేష్ క్షమాపణ.. అసలేం జరిగింది..?
తనిఖీల పేరుతో మంత్రులు ఎవరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లకూడదని ఆయన స్పష్టం చేశారు. మంత్రులు తమ పరిధిలోని శాఖల విధానపరమైన నిర్ణయాలపై దృష్టి పెట్టాలే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రచార ఆర్భాటాల కోసం తనిఖీలకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయాలు, మంత్రులకు ఇచ్చిన క్లాస్ చూస్తుంటే తమిళనాడులో అవినీతి రహిత పాలన దిశగా ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

