ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా భారత కార్ల మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరలేపబోతోంది. ప్రతి ఏటా ఆగస్టు 15న అంటే స్వాతంత్ర్య దినోత్సవం సరికొత్త వాహనాన్ని లేదా అప్డేటెడ్ మోడల్ ను లాంచ్ చేసే సాంప్రదాయాన్ని మహీంద్రా ఈ ఏడాది కూడా కొనసాగించనుంది. రాబోయే ఆగస్టు 15న దేశీయ మార్కెట్లోకి ఒక సరికొత్త ఎస్యూవీ మోడల్ ను విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ రోజు లాంచ్ చేయబోయే నిర్దిష్ట మోడల్ పేరును కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Also Read : ‘రాకా’ షూటింగ్లో దీపికా డెడికేషన్..!
ప్రస్తుతం మహీంద్రా సంస్థ రెగ్యులర్ ఇంజిన్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ముమ్మరంగా పరీక్షిస్తోంది. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన మోడల్స్ ఆధారంగా సరికొత్త అప్డేట్ రాబోతుందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల లీకైన వివరాల ప్రకారం మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ మొదటి వరుసలో ఉంది. 2022లో విడుదలైన ఈ పాపులర్ ఎస్యూవీకి ఇప్పటివరకు ఎలాంటి మేజర్ అప్డేట్స్ రాలేదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిడ్-లైఫ్ రీఫ్రెష్ కింద ఈ ఆగస్టు 15న దీని అప్డేటెడ్ ఫేస్లిఫ్ట్ వెర్షన్ నే మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also Read : ప్రభాస్ ఫౌజీ ఎఫెక్ట్.. బాలయ్య తగ్గాల్సిందేనా..?
ఈ కొత్త ఫేస్లిఫ్ట్ అవతార్లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్డ్ బంపర్, సరికొత్త హెడ్ల్యాంప్స్ మరియు అల్లాయ్ వీల్స్ ఉండబోతున్నాయి. వీటితో పాటు ఇంటీరియర్ లో పనోరమిక్ సన్ రూఫ్, పెద్ద 10.25-ఇంచుల టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి మార్పులను ఆశించవచ్చు. భద్రతను మరింత పెంచేందుకు బడ్జెట్ వేరియంట్లలో కూడా అడ్వాన్స్డ్ ADAS రక్షణ ఫీచర్లను మహీంద్రా పరిచయం చేయబోతున్నట్లు సమాచారం. ఒకవేళ స్కార్పియో ఎన్ కాకపోతే మహీంద్రా తన ప్రతిష్టాత్మక సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘బీఈ 07’ను పరిచయం చేస్తుందని టాక్. ఇంజిన్ పరంగా చూస్తే స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్లో పాత 2.2 లీటర్ టర్బో డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లే ఉండనున్నాయి.

