టీడీపీలో ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారా.. గీత దాటుతున్న నేతలకు వాతలు పెట్టేందుకు అధినేత సిద్ధం అవుతున్నారా.. అంటే అవుననే సంకేతాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. రెండేళ్ల పాటు కేవలం రాష్ట్రాభివృద్ధి పైన, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం పైనే చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెట్టారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ.. లోతుగా అయితే పార్టీ నేతల పని తీరును పరిశీలించలేదని తెలుస్తోంది. ఇదే అదునుగా భావించిన చాలా మంది నేతలు అధికారం వచ్చిన నాటి నుంచి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఇలాంటి వారిపై ఫిర్యాదులు వచ్చినా కూడా పెద్దగా చర్యలు తీసుకోలేదు.
Also Read : ప్రభాస్ ఫౌజీ ఎఫెక్ట్.. బాలయ్య తగ్గాల్సిందేనా..?
ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి సర్కార్ పైన, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన పదే పదే విమర్శలు చేస్తున్నారు. టార్గెట్ టీడీపీ అన్నట్లుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ మళ్లీ బలపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో పరిస్థితులు చక్కదిద్దేందుకు అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు వార్నింగ్తో సరిపెట్టిన చంద్రబాబు.. ఇప్పటి నుంచి కొరడా ఝుళిపించేందుకు రెడీ అయ్యారు.
కొంతమంది నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయని సీఎం చంద్రబాబు ఇప్పటికే వెల్లడించారు. ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలను వదులుకోవడానికీ వెనుకాడేది లేదన్న సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తేడాగా వ్యవహరించే అధికారులపై కూడా చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని.. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేలా ఇప్పటి నుంచే పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు త్వరలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తామని తెలిపారు.
Also Read : బుల్లెట్ ట్రైన్ రచ్చ.. భారత్ వర్సెస్ జపాన్..!
కొంతమంది నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పేరుకు చెడ్డపేరు తీసుకువచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో గ్రూప్ రాజకీయాలకు తెర లేపారని.. అలాంటి వారి పట్ల ఇక మెతక వైఖరి లేదన్నారు. ఎవరైనా సరే తనకు ఒకటే అని.. పార్టీ మరోసారి అధికారంలోకి రావలంటే.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాల్సిందే అని సూచించారు. తన వద్దకు ప్రతి ఒక్కరి వివరాలు సర్వే రూపంలో నివేదికలు వస్తున్నాయని.. పదవులు కావాలంటే.. పైరవీలు కాదు.. పని చేయాలని సూచించారు.

