దేశంలో.. దూరప్రాంత ప్రయాణాలకు అత్యంత ఆదరణ పొందిన స్లీపర్ బస్సులకు ఏపీలో కాలం చెల్లిపోనుందా..? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. రాష్ట్రంలో స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేయాలని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వానికి ఒక కీలక నివేదికను సమర్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాలని ఆస్కీ సూచించింది. ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే స్లీపర్ బస్సులపై నిషేధం ఉందని ఆస్కీ తన నివేదికలో పేర్కొంది.
Also Read : విపక్షాలతో మైండ్ గేమ్..? ఎన్నికల కోసమే స్టంట్..?
ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, మన దేశంలో కూడా అదే తరహా నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్లీపర్ బస్సుల నిర్మాణం, ప్రమాదాల సమయంలో ప్రయాణికులు బయటపడే అవకాశం తక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషించింది. స్లీపర్ బస్సులను ఒక్కసారిగా రద్దు చేస్తే ప్రయాణికులకు, రవాణా సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆస్కీ వెల్లడించింది. అందుకే వచ్చే 22 నెలల కాలాన్ని గడువుగా నిర్ణయించి, దశలవారీగా ఈ బస్సులను రోడ్లపై నుంచి తొలగించాలని సూచించింది.
Also Read : చిన్నారి పునర్వికకు పునర్జన్మ.. అన్నగా మాట నిలబెట్టుకున్న లోకేష్
ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు కూడా ఈ నిబంధనలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో స్పష్టం చేసింది. ప్రమాదాలు జరిగినప్పుడు స్లీపర్ బస్సుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉండటంపై ఆస్కీ ఆందోళన వ్యక్తం చేసింది. నిద్రలో ఉన్న ప్రయాణికులు అత్యవసర సమయాల్లో స్పందించే లోపే భారీ నష్టం జరుగుతోందని, అందుకే భవిష్యత్తులో కేవలం సీటింగ్ బస్సులనే అనుమతించాలని పేర్కొంది. ఈ నివేదికపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

