ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఏపీకి పూర్తిగా అండగా ఉంటామనే ప్రకటనకు కట్టుబడి కేంద్రం తొలి నుంచి చేయూత అందిస్తోంది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పూర్తిస్థాయి సహకారం అందిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి సాధ్యమైనన్ని నిధులు రాబడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించగా.. తాజాగా నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మరిన్ని వరాలు ఇచ్చింది మోదీ సర్కార్.
Also Read : చిన్నారి పునర్వికకు పునర్జన్మ.. అన్నగా మాట నిలబెట్టుకున్న లోకేష్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మోదీ సర్కార్ తొలి నుంచి దేశంలో మౌలిక వసతుల కల్పనకే పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తోంది. కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం, రైళ్ల వేగం, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకులకు మెరుగైన వసతులతో పాటు సరుకు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధాన రైల్వే మార్గాల్లో కొత్తగా మూడు, నాలుగో ట్రాక్ నిర్మిస్తోంది. ఇప్పటికే చెన్నై – ఢిల్లీ మార్గంలో మూడో ట్రాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా కొల్కతా – ముంబై మార్గంలో కూడా మూడు, నాలుగో ట్రాక్ నిర్మించనున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో రాజమండ్రి – విశాఖ మధ్య 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ – రాజమండ్రి మధ్య 3, 4 ట్రాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
Also Read : ప్రభాస్ ఫౌజీ కోసం హను రాఘవపూడి వైల్డ్ ప్లాన్.. ఆర్సీబీ కనెక్షన్ ఏంటి..?
భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.. ఈ పూల్ ఏర్పాటు కోసం రూ.12,980 కోట్లు కేటాయించింది. అలాగే కాకినాడ, మచిలీపట్నం, గంగవరం పోర్టులకు కనెక్టివిటీ పెంచేందుకు రూ.9,889 కోట్లు కేటాయించింది. అలాగే 198 కిలోమీటర్ల పోర్టు కారిడార్ ఏర్పాటుకు మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇక గోదావరి నదిపై కొత్తగా మరో వంతెనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4.3 కిలోమీటర్ల పొడవున గోదావరిపై కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది మోదీ సర్కార్.

