ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ అధికారులు విజయవాడ కోర్టులో సంచలన నిజాలతో కూడిన చార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఇప్పటివరకు ప్రచారం జరిగిన కథనాలకు భిన్నంగా సీఐడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఐడీ దాఖలు చేసిన చార్జ్షీట్ ప్రకారం.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను నటి కాదంబరి జెత్వాని తీవ్రంగా బ్లాక్ మెయిల్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
Also Read : టాబ్లెట్ కోసం ఇన్సులిన్ ఇంజెక్షన్ ఆపుతున్నారా..?
గతంలో విద్యాసాగర్ తో జెత్వానికి ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని, వ్యక్తిగత ఫోటోలను చూపిస్తూ ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ కు భయపడి విద్యాసాగర్ తన పరువు కాపాడుకోవడానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించినట్లు సీఐడీ సాంకేతిక ఆధారాలను సేకరించింది. విద్యాసాగర్ కు చెందిన రెండు బ్యాంక్ ఖాతాల నుండి సుమారు రూ.1.32 కోట్లు కాదంబరి జెత్వాని మరియు ఆమె తల్లి సంయుక్తంగా నిర్వహిస్తున్న జాయింట్ బ్యాంక్ ఖాతాకు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి.
Also Read : అమర్ రాజాకు ఏపీ గవర్నమెంట్ బిగ్ గిఫ్ట్..!
కేవలం బ్యాంక్ లావాదేవీలు మాత్రమే కాకుండా, జెత్వాని మరియు విద్యాసాగర్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్ డేటా, వారిద్దరి మొబైల్స్ లోని ఎస్ఎమ్ఎస్ సంభాషణలు, బ్యాంక్ చెక్కుల రికార్డులను అధికారులు క్షుణ్ణంగా విశ్లేషించారు. బెదిరింపుల ద్వారానే జెత్వాని ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు, విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదులో జెత్వానితో పాటు ఆమె తల్లి, తండ్రి, సోదరుడి పేర్లను కూడా ప్రస్తావించారు. అయితే, ఈ బ్లాక్మెయిలింగ్ వ్యవహారంలో జెత్వాని కుటుంబ సభ్యులకు నేరుగా ప్రమేయం ఉన్నట్లు ప్రస్తుతానికి తగిన ఆధారాలు లభించలేదని, మున్ముందు దర్యాప్తులో ఏవైనా కొత్త ఆధారాలు దొరికితే వారిపై సప్లిమెంటరీ చార్జ్షీట్ దాఖలు చేస్తామని సీఐడీ తెలిపింది.

