న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే నకిలీ విద్యార్హత పత్రాలతో ఏళ్ల తరబడి కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్లో సంచలనం రేపుతోంది. ఫోర్జరీ సర్టిఫికెట్ల ఆధారంగా న్యాయవాదులుగా చలామణి అవుతున్న 105 మంది వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా న్యాయవాదుల విద్యార్హతలను పరిశీలించేందుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టిన వెరిఫికేషన్లో ఈ అక్రమాలు బయటపడినట్లు సమాచారం. తనిఖీల్లో కొందరు న్యాయవాదులు కేవలం ఎల్ఎల్బీ డిగ్రీనే కాకుండా 10వ తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లను సైతం నకిలీవిగా సృష్టించినట్లు గుర్తించారు.
Also Read : బ్రేకింగ్ : అమరావతిపై ఆళ్ళ కుట్రలకు సుప్రీం బ్రేక్..!
ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్లోని కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్ సింగ్ అనే వ్యక్తి ఉదంతం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాల ఆధారంగా ఆయన ఏకంగా 35 ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడైంది. అలహాబాద్ విశ్వవిద్యాలయం పేరుతో నకిలీ డిగ్రీ పత్రాలను ఉపయోగించినట్లు తనిఖీల్లో తేలినట్లు సమాచారం. కోర్టు ప్రాంగణాల్లోనే నకిలీ విద్యార్హతలతో న్యాయవాదులుగా చలామణి అవుతున్న ఘటనపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ఏమాత్రం ఉపేక్షించకుండా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Also Read : గౌతమ్ గంభీర్ కోచ్ పదవి సేఫేనా..?
హైకోర్టు ఆదేశాలతో ప్రయాగ్ రాజ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ సమర్పించిన 105 మంది అనుమానిత నకిలీ న్యాయవాదుల జాబితాను పరిశీలించిన పోలీసులు.. కేవలం మూడు రోజుల్లోనే 39 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. మిగిలిన 66 మంది వ్యవహారంపైనా దర్యాప్తు కొనసాగుతోంది. వారి విద్యార్హతలు, డిగ్రీల జారీ వివరాలు, బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్కు సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నకిలీ డిగ్రీలతో న్యాయవాదులుగా చలామణి అవుతున్న వారి వ్యవహారం బయటపడటం.. న్యాయ వ్యవస్థలో విద్యార్హతల ధ్రువీకరణపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.

