తిరుపతి పుణ్యక్షేత్రం సమీపంలోని పవిత్ర శేషాచలం అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అటవీ సంపదకు జరుగుతున్న నష్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, నేరుగా క్షేత్రస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.
Also Read : కవిత టీఆర్ఎస్.. ఏపీలో జోరుగా చర్చ..!
అగ్నిప్రమాద తీవ్రత మరియు మంటలను అదుపు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై పవన్ కల్యాణ్ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి నుంచి పూర్తిస్థాయి వివరణ కోరారు. అపురూపమైన ఎర్రచందనం, ఔషధ మొక్కలు, వన్యప్రాణులకు నిలయమైన శేషాచలం అడవులను కాపాడుకోవడానికి అవసరమైతే అదనపు బలగాలను, ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఆదేశించారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read : ఏపీలో నరకం చూస్తున్న రైతన్నలు..!
ముఖ్యంగా ఈ అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా..? అనే అంశంపై ఆయన ఆరా తీశారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అడవికి మంటలు పెట్టినట్లు తేలితే వారిని వదిలే ప్రసక్తే లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, ఉక్కుపాదం మోపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీ సంపదను ధ్వంసం చేసే శక్తులపై కఠినంగా వ్యవహరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

