వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుపై అతను నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యాడు. 2024 నవంబర్ లో నమోదైన ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు నోటీసులు అందుకున్న భార్గవ్, చివరకు విచారణాధికారుల ముందుకు రావాల్సి వచ్చింది. భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ కీలక నేతలు అహ్మద్, రెడ్డప్ప కూడా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.
Also Read : మారిన వీసా నిబంధనలు.. భారతయ విద్యార్థులు జాగ్రత్త పడాల్సిందే..!
సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుడు ప్రచారం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనే కోణంలో పోలీసులు అతని సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా విభాగాన్ని నడిపించిన విధానంపై కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేవలం మదనపల్లి కేసు మాత్రమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సజ్జల భార్గవ్ పై అనేక కేసులు నమోదయ్యాయి. ఒకవైపు కుప్పం కేసు, మరోవైపు పులివెందులలో నమోదైన కేసులు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Also Read : విశాఖ.. పోర్ట్ టూ డేటా సిటీ..!
ఇన్నాళ్లూ విచారణకు దూరంగా ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలు మరియు పోలీసుల దూకుడు పెరగడంతో అతను విచారణకు రావక తప్పలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో, భార్గవ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. విచారణ అనంతరం పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

