డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న.. పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మంగళవారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రోటోకాల్ వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఫోటోను విస్మరించి, కేవలం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను మాత్రమే హైలైట్ చేయడంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నేత పెండెం దొరబాబు మధ్య జరిగిన వాగ్వాదం నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారి తీసింది.
Also Read : సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ..!
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి వర్మ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫోటో ఉండి తీరాలి, ఇది ప్రోటోకాల్ నిబంధన అని స్పష్టం చేసారు. ఈ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత పెండెం దొరబాబు జోక్యం చేసుకోవడంతో ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటామాటా పెరిగింది. దొరబాబు ఒక్కసారిగా వర్మపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.
ఈ ఘటన అనంతరం వర్మ మీడియా ముందు పెండెం దొరబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొరబాబు ఎవడు..? మట్టి వ్యాపారం చేసుకునే వ్యక్తి మళ్ళీ చెరువులు తవ్వడానికి వచ్చాడు అంటూ మండిపడ్డారు. గతంలో తాము ఎవరి అరాచకాలపై పోరాటం చేశామో, ఇప్పుడు వారే వచ్చి తమపై పెత్తనం చెలాయించడాన్ని వర్మ తప్పుబట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ ప్రశాంతంగా ఉంటున్నామన్నారు. కానీ, గెలిపించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే పడి కొడతారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మొత్తానికి హిట్ కొట్టిన టాలీవుడ్..!
వైసీపీ నుంచి వచ్చిన వారు ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తన సీటును త్యాగం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తి కొన్నాళ్లుగా కొనసాగుతోంది. తాజా ఘటనతో ఈ విభేదాలు మరింత ముదిరాయి. అధికారుల తీరు కూడా జనసేనకు అనుకూలంగా ఉందని, టీడీపీని కావాలనే పక్కన పెడుతున్నారని వర్మ వర్గం ఆరోపిస్తోంది. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది, దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

