కూటమి ప్రభుత్వ హయాంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అప్పుడే వణుకు మొదలైంది. తనపై నమోదవుతున్న వరుస పోలీసు కేసులపై ఆయన తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతున్నారు. ఒకే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదు చేస్తూ, కూటమి నేతలు తనను రాజకీయంగా వేధిస్తున్నారంటూ అంబటి రాంబాబు బాధితుడి కార్డు ప్లే చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తప్పు చేసి చట్టానికి దొరికిపోయాక.. ఇలాంటి పొలిటికల్ డ్రామాలకు తెరలేపడం అంబటికే చెల్లిందని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు.
Also Read : ఏపీ సంక్షేమ పథకాలే స్ఫూర్తిగా..? విజయ్ కీలక ప్రకటన..!
వ్యవస్థలను కించపరుస్తూ, సమాజంలో అశాంతి రేపేలా పోస్టులు పెట్టిన అంబటి రాంబాబు.. ఇప్పుడు తీరా పోలీసులు యాక్షన్ లోకి దిగేసరికి అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు. తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో ఏ విషయాలపైనైనా తన అభిప్రాయాలు చెప్పే పూర్తి హక్కు తనకు ఉందంటూ రాజ్యాంగం ఇచ్చిన భావప్రకటన స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి.. చట్టాన్ని, పోలీసు విచారణను ఎదుర్కోవడానికి భయపడుతూ ఇలాంటి కుంటిసాకులు వెతుక్కోవడం హాస్యాస్పదంగా మారిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు కాదు… పాపాల ఫలితం
రాజకీయ విమర్శలు చేయడం వేరు.. విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం వేరని, ఆ కనీస విచక్షణ కూడా అంబటి మరిచిపోయారని సామాన్య ప్రజలు సైతం తప్పుబడుతున్నారు. ఇన్నాళ్లూ అధికార గర్వంతో సోషల్ మీడియా వేదికగా ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ, వ్యక్తిగత కక్షలను రెచ్చగొట్టినప్పుడు లేని హక్కులు.. ఇప్పుడు కేసులు పెట్టగానే గుర్తొచ్చాయా అని జనం ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని, రాజకీయ హుందాతనం మరిచి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్ వినపడుతోంది.

