మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మద్యం రవాణా టెండర్లలో జరిగినట్లు అనుమానిస్తున్న అక్రమాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Also Read : ఆ పదవి వర్ల కోసమే..!
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కెసిరెడ్డి ఉన్నారు. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా? టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. మద్యం రవాణా టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థను వినియోగించిన వ్యవహారంపైనా ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టెండర్ల ప్రక్రియ, సంబంధిత వ్యక్తులు, సంస్థల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Also Read : గ్రూప్-1 స్కామ్.. జగన్కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!
ఇప్పటికే అరెస్టయిన నిందితుల నుంచి లభించిన సమాచారం ఆధారంగా దర్యాప్తును మరింత విస్తరిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కేసులో హవాలా లావాదేవీలు జరిగాయన్న అనుమానాలపైనా ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరింది, టెండర్ల వ్యవహారంతో ఆ లావాదేవీలకు ఉన్న సంబంధం ఏమిటనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరినట్లు భావిస్తున్నారు.

