APPSC గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలకు పాల్పడటమే కాకుండా..ఇప్పుడు ప్రెస్మీట్ పెట్టి వైసీపీ అధినేత జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కూటమి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. హైకోర్టు ఆదేశాలు, సిట్ దర్యాప్తు నివేదికలను తనకనుగుణంగా వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఓ ప్రకటనలో మండిపడింది. గ్రూప్-1 వ్యవహారంపై జగన్ చెప్పిన మాటల్లోని డొల్లతనాన్ని, అసలు వాస్తవాలను కూటమి సర్కార్ లెక్కలతో సహా బట్టబయలు చేసింది.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు వ్యూహం అదే..!
మాన్యువల్ మూల్యాంకనం అంతా CC కెమెరాల నిఘాలోనే పకడ్బందీగా జరిగిందని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మూల్యాంకనం మొదలైన 17 రోజుల తర్వాతే అక్కడ CC కెమెరాలు పెట్టారని, కఠిన నిషేధం ఉన్నప్పటికీ చీఫ్ ఎగ్జామినర్లు మొబైల్ ఫోన్లు వాడినట్లు సిట్ అధికారులు CCటీవీ ఫుటేజ్ ఆధారాలతో సహా తేల్చారని స్పష్టం చేసింది. ఇక డిజిటల్ మూల్యాంకనాన్ని హైకోర్టు తప్పుపట్టలేదన్న జగన్ వాదనను సైతం ప్రభుత్వం ఖండించింది. నిబంధనల ఉల్లంఘన వల్లే హైకోర్టు డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి, 3 నెలల్లోగా మాన్యువల్ పద్ధతిలో చేయాలని తీర్పునిచ్చిందని గుర్తుచేసింది. భవిష్యత్తు పరీక్షలకు చట్టబద్ధంగా అన్ని అనుమతులతో డిజిటల్ పద్ధతి వాడుకోవచ్చన్న న్యాయమూర్తి సూచనను.. జగన్ వక్రీకరించి అసలు తీర్పే అదన్నట్లుగా ప్రొజెక్ట్ చేశారని ఎద్దేవా చేసింది.
OMR స్లిప్పుల్లోని మార్కులకు, జవాబు పత్రాలకు తేడాల్లేవని సిట్ చెప్పిందనడం మరో అబద్ధమని ప్రభుత్వం పేర్కొంది. సిట్ నివేదికలోని ఎర్రర్ లిస్ట్కు సంబంధించిన ఒక చిన్న పేరాను మాత్రమే జగన్ చదివారని, 2026 జూన్లో సీఐడీ, మధ్యవర్తుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ పరిశీలించినప్పుడు భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయని వివరించింది. సిట్ గుర్తించిన 16 తప్పుల్లో 14 నిజమేనని APPSC కార్యదర్శి స్వయంగా స్పష్టం చేసిన విషయాన్ని దాచేశారని దుయ్యబట్టింది. అలాగే, OMR షీట్లలో మార్పులు మూల్యాంకనంలో భాగమేనని, ఎగ్జామినర్లే ఆ సవరణలు చేశారన్న వాదనను తిప్పికొట్టింది. సవరణలు చేయాలంటే అధికారుల ఆథరైజేషన్ కచ్చితంగా ఉండాలని, కానీ ఇక్కడ అనధికార వ్యక్తులు ఇష్టారాజ్యంగా మార్కులు మార్చేశారని వెల్లడించింది. జి.సోమశేఖర్ అనే ఎగ్జామినర్ ఒక అభ్యర్థికి 99 మార్కులు వేస్తే, తనకు తెలియకుండానే ఆ మార్కులను ఎవరో 86కు మార్చేశారని సిట్ విచారణలో ఆయనే స్వయంగా వెల్లడించిన విషయాన్ని ప్రభుత్వం ఈ సందర్భంగా గుర్తుచేసింది.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. చంద్రబాబు వ్యూహం అదే..!
తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఏకంగా సుప్రీంకోర్టు తీర్పులనే వక్రీకరించారని ప్రభుత్వం విమర్శించింది. యూపీఎస్సీకి సంబంధించిన సంజయ్సింగ్ వర్సెస్ UPSC కేసు తీర్పును జగన్ ఉదహరించారని, అది ఏపీపీఎస్సీకి ఏమాత్రం వర్తించదని కుండబద్దలు కొట్టింది. OMR మూల్యాంకనం స్లిప్పులో ఎగ్జామినర్కు కేటాయించిన భాగంలో ఏ చిన్న మార్పులు చేయాలన్నా చీఫ్ ఎగ్జామినర్కు అధికారం లేదని APPSC స్పష్టం చేసినట్లు తెలిపింది. కొందరు అభ్యర్థుల OMR షీట్లలో అనధికారికంగా దిద్దటాలు, వాటిపై ఎగ్జామినర్ల సంతకాలు లేకపోవడం తదితర ఆధారాలను ప్రభుత్వం ఉదాహరణలతో సహా వివరిస్తూ జగన్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చింది.

