కాకినాడ: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తుండగా, అతని ప్రవర్తన చూసి అధికారులు సైతం విస్మయానికి గురవుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన సాదిక్లో కనీస పశ్చాత్తాపం కూడా కనిపించడం లేదని పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
Also Read : గ్రూప్-1 స్కామ్.. జగన్కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!
విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సాదిక్ అత్యంత తలబిరుసుగా సమాధానాలు ఇస్తూ పొగరుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. నూకరాజు కుటుంబం బలవన్మరణానికి, తనకు ఎలాంటి సంబంధం లేదంటూ పోలీసుల ఎదుట పదే పదే బుకాయిస్తున్నాడు. నూకరాజు కుటుంబ ఆత్మహత్యకు ముందే ఆయన అల్లుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆ మరణంతో కూడా తనకు ఏలాంటి లింక్ లేదని సాదిక్ గట్టిగా వాదిస్తున్నాడు.
Also Read : కారుమూరికి ఈడీ షాక్..!
నూకరాజు కుమార్తెనే ఇంట్లో ఏవో ట్యాబ్లెట్లు ఇచ్చేదని, ఆ విషయాలు తనకేం తెలియదంటూ నేరాన్ని మొత్తం ఆమెపైకి నెట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నల నుంచి తప్పించుకోవడానికి సాదిక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. సాదిక్ నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు అన్ని కోణాల్లో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం నిందితుడు సాదిక్ను ఈరోజు సాయంత్రం కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

