తమిళనాడు శాసనసభలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మహిళా లోకానికి భారీ వరాలు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల వేదికగా ఆయన రెండు కీలక సంక్షేమ పథకాలను అధికారికంగా వెల్లడించి సంచలనం సృష్టించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా మహిళల ఆర్థిక సాధికారత, భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమిళనాడు వ్యాప్తంగా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
Also Read : గ్రూప్-1 స్కామ్.. జగన్కు కూటమి దిమ్మతిరిగే కౌంటర్!
‘వెట్రి పయనం’ పేరుతో తీసుకురానున్న ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని రాబోయే అక్టోబర్ 2వ తేదీ (గాంధీ జయంతి) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు, విద్యార్థినులు, సామాన్య మహిళలకు రవాణా ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. బస్సు ప్రయాణంతో పాటు లబ్ధిదారులైన మహిళా కుటుంబ పెద్దలకు సీఎం విజయ్ మరో తీపి కబురు అందించారు. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం కలిగిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంవత్సరానికి 3 వంటగ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు.
Also Read : హెచ్1ఎన్1 వస్తే హార్ట్ ఎటాక్ వస్తుందా..?
ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పెరిగిన లగ్జరీ వంటగ్యాస్ ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ‘దీపం’ పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పుడు సరిగ్గా అదే తరహా సంక్షేమ పథకాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా ప్రకటించడం విశేషం. ఏపీలోని సంక్షేమ నమూనాను ఆదర్శంగా తీసుకుని సీఎం విజయ్ తమిళనాడులో ఈ పథకాలను డిజైన్ చేశారంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఏదేమైనా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల తమిళనాడు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

