కాకినాడ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి. కోనసీమ పర్యటనలో ఉన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ ఘోర ఆత్మహత్యల వెనుక కేవలం అప్పుల బాధే కాకుండా, ఒక పక్కా మత మార్పిడి కుట్ర మరియు లవ్ జిహాద్ కోణాలు దాగి ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాం నుంచే ఆంధ్రప్రదేశ్లో లవ్ జిహాద్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
Also Read : విశాఖ స్టీల్ ప్లాంట్.. కేంద్రం కీలక నిర్ణయం..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో మత మార్పిడిలను తీవ్రంగా ప్రోత్సహించారని, ఆ అండతోనే ఇలాంటి కిరాతక ముఠాలు రెచ్చిపోయాయని ఆయన ధ్వజమెత్తారు. చట్టాల పట్ల భయం లేకుండా అప్పట్లోనే ఈ శక్తులు పాతుకుపోయాయని విమర్శించారు. కరడుగట్టిన నేరస్థుడైన సాదిక్ ఖాన్ క్రూరమైన వేధింపుల వల్లే తట్టుకోలేక ఏఈ నూకరాజు తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. కేవలం వేధించడమే కాకుండా, రావులపాలెంలో నూకరాజుకు చెందిన దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన భారీ ఆస్తిని సాదిక్ ఖాన్ బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నాడనే షాకింగ్ నిజాన్ని ఆయన బయటపెట్టారు.
Also Read : పథకం మంచిదే.. కానీ అమలు ఏది..?
ఈ మత మార్పిడి మరియు లవ్ జిహాద్ వ్యవహారం కేవలం ఒక్క నూకరాజు కుటుంబానికే పరిమితం కాలేదని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సాదిక్ ఖాన్తో పాటు మరో 9 మందితో కూడిన ఒక టెర్రరిస్ట్ ముఠా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో యాక్టివ్గా పనిచేస్తోందని ఆరోపించారు. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ఇప్పటివరకు దాదాపు 15 కుటుంబాలను ఈ ముఠా టార్గెట్ చేసి వేధించిందని తెలిపారు. హిందూ సామాజిక వర్గాలలోని మహిళలను టార్గెట్ చేస్తూ, మత మార్పిడిలే లక్ష్యంగా వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, బ్లాక్మెయిల్ చేస్తూ ఆస్తులు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ మొత్తం నెట్వర్క్పై మరియు నిందితుడు సాదిక్ ఖాన్ వెనుక ఉన్న శక్తులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి, బాధితులకు న్యాయం చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

