మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించి హంగామా సృష్టించిన వైసీపీ శ్రేణులపై పోలీసులు కఠినంగా స్పందించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పటికీ, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ భారీ జనసమీకరణ, నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు నిర్వహించారనే కారణంతో పలువురు కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి.
Also Read : నకిలీ డిగ్రీతో ప్రాక్టీస్.. అంతా దొంగలే..!
ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. దీంతో పాటు పర్యటనలో భాగంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేసి రచ్చ సృష్టించిన వైసీపీ నేత సుభాష్ చంద్రబోస్, మరియు ఆయన అనుచరులపై కూడా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. నిబంధనలను గాలికొదిలేసి రోడ్లపై ఓవరాక్షన్ చేసిన మరికొంతమంది నాయకులు, కార్యకర్తలపై కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో విడివిడిగా కేసులు నమోదు చేశారు.
Also Read : ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి కీలక బాధ్యతలు..!
ప్రస్తుతం పోలీసులు ఆయా ప్రాంతాల్లోని వీడియో క్లిప్పింగ్స్, నిఘా కెమెరాల ఆధారంగా నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, అనుమతులు లేకుండా భారీ ర్యాలీలు మరియు జనసమీకరణ చేపడితే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. జగన్ పర్యటన ముగిసిన వెంటనే పోలీసులు తీసుకున్న ఈ సంచలన రియాక్షన్తో స్థానిక వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

