నేటి తరం యువత అలియాస్ జెన్ జీ.. అనగానే అందరికీ గుర్తొచ్చేది బ్రాండెడ్ వస్తువులు, ఖరీదైన లైఫ్స్టైల్, దేశవిదేశాల పర్యటనలు. కానీ, వాస్తవంలో వారి ఆర్థిక ప్రణాళికలు, ఖర్చుల శైలి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఒక తాజా అధ్యయనం వెల్లడించింది. శాలరీస్ అనే సంస్థ సుమారు 5.2 లక్షల మంది ఉద్యోగస్తులైన జెన్ జీ.. యూజర్ల మిలియన్ల కొద్దీ యూపీఐ లావాదేవీలను విశ్లేషించి ఈ ఆసక్తికర నివేదికను విడుదల చేసింది. యువత కేవలం జల్సాలకే ప్రాధాన్యత ఇస్తారనే సాధారణ అంచనాలను తలకిందులు చేస్తూ.. వారు తమ నెలవారీ సంపాదనలో సింహభాగాన్ని నిత్యావసరాలు, బాధ్యతాయుతమైన ఖర్చులకే కేటాయిస్తున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.
Also Read : గౌతమ్ గంభీర్ కోచ్ పదవి సేఫేనా..?
ఈ నివేదిక ప్రకారం.. జెన్ జీ యువత తమ నెలవారీ బడ్జెట్లో ఏకంగా 70 శాతానికి పైగా నిధులను కేవలం ఐదు ప్రధాన విభాగాలకే పరిమితం చేస్తున్నారు. ఇందులో అత్యధికంగా ఇళ్ల అద్దెలు, కరెంట్ బిల్లులు, డిజిటల్ సబ్స్క్రిప్షన్ల వంటి మంత్లీ బిల్లులకే 20.1 శాతం ఖర్చవుతోంది. ఆ తర్వాత వరుసగా నిత్యావసర వస్తువులకు 15.7 శాతం, ఆర్థిక సేవలు లేదా ఈఎంఐలకు 12.2 శాతం, షాపింగ్కు 11.9 శాతం, ఆహారానికి 11.5 శాతాన్ని వారు వెచ్చిస్తున్నారు. వీటన్నింటినీ గమనిస్తే, భేషజాలకు పోకుండా రోజువారీ అవసరాలకే ఈ తరం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టమవుతోంది.
Also Read : ఎన్డీయే కన్వీనర్ గా సీఎం చంద్రబాబు..?
ఇక అందరినీ ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. ఎప్పుడూ టూర్లు, సరికొత్త అనుభూతుల కోసం వెంపర్లాడుతుంటారని పేరున్న ఈ యువత, ట్రావెలింగ్ కోసం తమ నెలవారీ ఖర్చుల్లో కేవలం 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. వినోద రంగ సబ్స్క్రిప్షన్లలో జియో సినిమా-హాట్స్టార్ 12.4 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, నెట్ఫ్లిక్స్ (10.7%), స్పాటిఫై (5.6%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ.. బాధ్యతలు పెరగడం వల్ల నిత్యావసరాల ఖర్చు 50% నుండి 59 శాతానికి పెరుగుతోందని ఈ సర్వే పేర్కొంది. మొత్తానికి యూపీఐ, ఆటో-పే వంటి డిజిటల్ విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ జెడ్ జనరేషన్ తమ ఆర్థిక జీవితాన్ని ఎంతో తెలివిగా మేనేజ్ చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

