ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 18న ఈ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ బాబుల పదవీకాలం జూన్ 26తో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ జూన్ 1న విడుదల కానుంది.
Also Read : షా దృష్టిలో చంద్రబాబు స్థానం ఏమిటీ..?
అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8 వరకు గడువు ఇచ్చారు. అనంతరం జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. పోటీ నుండి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు సమయం ఉంటుంది. జూన్ 18న ఉదయం నుండి పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ప్రస్తుత శాసనసభలోని సీట్ల సంఖ్యా బలాన్ని బట్టి ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు అధికార ఎన్డీఏ కూటమి ఖాతాలోకే వెళ్లనున్నాయి.
Also Read : మంత్రి గారి ప్రేమ మామూలుగా లేదుగా..!
కూటమిలోని అంతర్గత సర్దుబాట్ల ప్రకారం ఈ నాలుగు స్థానాలలో తెలుగుదేశం పార్టీకి 2, జనసేన పార్టీకి 1, మరియు బిజెపికి 1 స్థానం కేటాయించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. టీడీపీ పార్టీ కోటా నుండి ప్రస్తుత సభ్యుడు సానా సతీష్ బాబు పేరు మళ్లీ ప్రముఖంగా వినిపిస్తోంది. అతనితో పాటు మంత్రి లోకేష్కు అత్యంత ఆప్తుడైన కిలారు రాజేష్, మాజీ ఎంపీ జయదేవ్ గల్లా, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
Also Read : మీరు తేనెపూసిన కత్తులు.. జగన్ పై విరుచుకుపడ్డ పార్థసారథి రెడ్డి
జనసేన పార్టీకి దక్కే ఒక స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక బీజేపీ కోటా నుండి తమిళనాడు నేత కె. అన్నామలైను ఏపీ నుండి రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరుగుతుండగా, రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ పేరు కూడా రేసులో ఉంది. జూన్ మొదటి వారంలో ఈ అభ్యర్థులపై అధికారిక స్పష్టత రానుంది.

