భారత్ లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకుని కియా ఇండియా సరికొత్త లైనప్ ను ప్రకటించింది. తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ ఫుల్ టీజర్ ను విడుదల చేస్తూ భవిష్యత్తు వాహనాలపై హింట్ ఇచ్చింది. ఈ టీజర్లో హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అనే పదాలను మారుస్తూ.. “భవిష్యత్తు తలుపు తడుతోంది. ఒక క్లూ.. ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు” అనే ఆసక్తికరమైన క్యాప్షన్ ను జత చేసింది. ఈ టీజర్ ప్రకారం కియా త్వరలోనే ఒక పూర్తి ఎలక్ట్రిక్ మరియు ఒక ప్రీమియం హైబ్రిడ్ కారును భారత్ లో లాంచ్ చేయబోతోంది.
గత కొంతకాలంగా భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న కియా సైరోస్ ఈవీ ఈ టీజర్ లోని ప్రధాన బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ కాబోతోందని ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈవీ6, ఈవీ9 మరియు త్వరలో రాబోయే కేరెన్స్ క్లావిస్ ఈవీ తర్వాత దేశంలో కియా నుండి రాబోతున్న నాల్గవ ఎలక్ట్రిక్ మోడల్ ఇదే కావడం విశేషం. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బాక్సీ డిజైన్, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్ తో రానుంది. అంతేకాకుండా ఇందులో 30-ఇంచుల ట్రినిటీ డిస్ ప్లే, పనోరమిక్ సన్రూఫ్, 360-డిగ్రీల కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఇక హైబ్రిడ్ విభాగంలో కియా తన ఫ్లాగ్షిప్ మోడల్ సోరెంటో హైబ్రిడ్ ఎస్యూవీని రంగంలోకి దించనుంది. సెల్టోస్ కారు కంటే పై సెగ్మెంట్లో, మూడు వరుసల సీటింగ్ ఆప్షన్లతో రాబోయే ఈ లగ్జరీ కారు మార్కెట్లో స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో సెల్ఫ్-చార్జింగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో పాటు బోస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను కియా జోడించనుంది. కియా తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయం భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టబోతోంది.

