అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తాత్కాలిక యుద్ధ విరామ ఒప్పంద గడువు ముగిసిన వెంటనే అంతర్జాతీయ సముద్ర మార్గంలో మళ్లీ క్షిపణుల మోత మోగింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ రెండు క్షిపణులతో దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు భారీ నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.
Also Read : ఆ సినీయర్ను నమ్మించి మోసం చేసిన జగన్..!
ఈ దాడులు జరగడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం తాము దయతలచి ఒక వారం రోజుల పాటు ఇరాన్ కు సెలవు ఇచ్చామంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరాన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని, ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన వారం రోజుల తాత్కాలిక ఒప్పందం ముగిసిన వెంటనే ఇరాన్ ఈ ప్రతీకార దాడులకు తెగబడిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
Also Read : నాడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి..?
తాజా క్షిపణి దాడులతో పాటు ఒమన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న మరో భారీ చమురు ట్యాంకర్ పై కూడా గుర్తుతెలియని ప్రొజెక్టైల్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ఆ ట్యాంకర్ లో భారీగా మంటలు చెలరేగాయని బ్రిటన్ సైనిక విభాగం ప్రకటించింది. జలసంధి నుంచి దక్షిణ దిశగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, ఆ ప్రాంతంలో ప్రయాణించే ఇతర నౌకలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో తాము శాంతియుత ఒప్పందాన్నే కోరుకుంటున్నామని, ఒకవేళ ఇరాన్ ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. “మేము కేవలం ఒక్క గంటలోనే ఇరాన్ వంతెనలన్నింటినీ కూల్చివేయగలం” అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

