అవును.. వాళ్లు ఏమయ్యారు.. ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీలో బాగా వినిపిస్తోంది. ఇంతకీ వాళ్లు ఎవరో తెలుసా.. వాళ్లే పార్టీ అధికార ప్రతినిధులు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 14 మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కూడా. అయితే వారంతా ఇప్పుడు ఏమయ్యారనే ప్రశ్న పార్టీలో బాగా వినిపిస్తోంది. ఏపీలో అధికారం కోసం వైసీపీ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కులాల మధ్య కుంపట్లు, నేతల మధ్య విబేధాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా వెనుకాడటం లేదు.
Also Read : రేవంత్ క్యాంపు ఆఫీసుల చుట్టూ విమర్శలు..!
ఓ వైపు వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ తరఫు నుంచి సరైన కౌంటర్ లేదనే మాట ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపైన ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తాయి. ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయడం సహజం. వాటిని అధికార పార్టీ నేతలు సమర్థవంతంగా తిప్పి కొట్టినప్పుడే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. 2019 – 24 మధ్య కాలంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్పైన నాటి టీడీపీ నేతలు ఎన్నో ఆరోపణలు చేశారు. ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ తప్పులను నిలదీయటంలో నాటి అధికార ప్రతినిధుల పాత్ర చాలా కీలకం.
అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ తగ్గినట్లుగా ఉంది. ఇంకా చెప్పాలంటే.. అలసత్వం పెరిగినట్లుగా బాగా కనిపిస్తోంది. ఓ వైపు వైసీపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. జరగని వాటిని కూడా ప్రభుత్వం చేసినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఏకంగా మంత్రి నారా లోకేష్ పైనే అవినీతి ఆరోపణలు చేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారానికి కాపు కులం మసి రాసేందుకు యత్నించారు. దీనిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెడకు చుట్టే ప్రయత్నం చేశారు. ఇక పరిశ్రమల ఏర్పాటుపై క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అమరావతి అవినీతి అంటూ చంద్రబాబు పైనే ఆరోపణలు చేస్తున్నారు కూడా.
Also Read : ప్రభుత్వ లాయర్ల వైఫల్యమేనా..? కూటమిలో అసహనం..!
ఇన్ని జరుగుతున్నా కూడా.. తెలుగుదేశం పార్టీ తరఫున కనీసం కౌంటర్ రావటం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోనే కొత్త కార్యవర్గం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 14 మందిని అధికార ప్రతినిధులుగా నియమించారు. కూన రవికుమార్, వసంత కృష్ణప్రసాద్, కావలి గ్రీష్మా, ఉండవల్లి శ్రీదేవి వంటి నేతలు కూడా ఉన్నారు. ఇక జాతీయ అధికార ప్రతినిధులుగా ఎంపీలు కలిశెట్టి అప్పలనాయుడు, తెన్నేటి కృష్ణప్రసాద్, దీపక్ రెడ్డి, బీకే పార్థసారథి, నన్నూరి నర్సిరెడ్డి కూడా ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరు కూడా ఇటీవల ప్రెస్ ముందుకు వచ్చిన దాఖలాలు కనిపించటం లేదు. ఓ వైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేస్తుంటే.. టీడీపీ తరఫున అధికార ప్రతినిధులు కనీసం కౌంటర్ ఇవ్వటం లేదు. మళ్లీ మళ్లీ అదే అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు తప్ప మరెవరు కనిపించటం లేదు. దీంతో వీరి మాటలను పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇదే వైసీపీకి ప్లస్ పాయింట్గా మలుచుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే పదే పదే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. అయినా సరే.. టీడీపీ నేతలకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదు.

