వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు ఆయనను రోజుకో పోలీస్ స్టేషన్ కు తిప్పుతూ గంటల తరబడి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేడు పులివెందుల పోలీసుల విచారణకు హాజరైన భార్గవ్ రెడ్డిని అధికారులు సుమారు ఎనిమిది గంటల పాటు విచారించారు. విచారణలో భార్గవ్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు సవాల్ గా మారింది.
Also Read : బ్రేకింగ్ : టీడీపీ ‘మహానాడు’ వేదిక మార్పు..!
సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టుల గురించి పోలీసులు ప్రశ్నించగా, చాలా ప్రశ్నలకు ఆయన “నాకు తెలియదు” లేదా “గుర్తులేదు” అని సమాధానం ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆక్టివ్ గా ఉండే కార్యకర్తలే స్వయంగా ఆ పోస్టులు పెట్టి ఉంటారని బాధ్యతను కింది స్థాయి శ్రేణులపైకి నెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. తన ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగాయని చెప్పడం ద్వారా కేసు నుండి బయటపడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.
Also Read : బీ కేర్ ఫుల్.. చంద్రబాబు మాస్ వార్నింగ్..!
మరోవైపు పోలీసులు మాత్రం భార్గవ్ రెడ్డిని వదిలేలా కనిపించడం లేదు. విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదన్న కారణంతో పోలీసులు రోజుకో ప్రాంతానికి ఆయనను మారుస్తున్నారు. ఒక స్టేషన్లో విచారణ ముగియగానే మరో స్టేషన్ నుండి నోటీసులు ఇస్తూ విచారణకు రావాలని ఆదేశిస్తున్నారు. పులివెందుల విచారణ ముగిసిన వెంటనే, మే 1వ తేదీన మళ్ళీ విచారణకు హాజరుకావాలని పోలీసులు తాజా నోటీసులు జారీ చేశారు. అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడమే లక్ష్యంగా పోలీసులు ఈ విచారణను వేగవంతం చేశారు.

