ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. 64వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో మంత్రి నారాయణ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. అమరావతి పరిధిని విస్తరిస్తూ మోతడకలో ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు నూతన రైల్వే లైన్ నిర్మాణం కోసం దాదాపు 2,340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి ఈ సమావేశంలో అధికారిక ఆమోదం లభించింది. ఈ నిర్ణయం రాజధాని ప్రాంతంలో రవాణా రంగ రూపురేఖలను మార్చడమే కాకుండా, భవిష్యత్తు మౌలిక వసతుల కల్పనకు గట్టి పునాది వేయనుంది.
Also Read : మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..!
మరోవైపు అమరావతిని డిజిటల్, సాంకేతిక హబ్గా మార్చేందుకు ఐటీ రంగంలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీలో రెండు 18 అంతస్తుల ఐటీ టవర్ల నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగిస్తూ ఆమోదం తెలిపారు. దీంతో పాటు రాజధాని పరిధిలోని డేటా సెంటర్ల అవసరాల కోసం 9 గిగావాట్ల విద్యుత్ సామర్థ్య పనులకు టెండర్లు పిలవాలని, అమరావతిలోని 20 ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక 5జీ టవర్లను తక్షణమే ఏర్పాటు చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
Also Read : నవంబర్ వరకు నో ఎలక్షన్స్.. ఫుల్ క్లారిటీ..!
పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, కనకదుర్గ గుడి, పున్నమి ఘాట్ మరియు భవానీ ఐలాండ్ లను అనుసంధానించే ప్రతిష్టాత్మక రోప్ వే ప్రాజెక్టుకు కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్తు మెగా సిటీ అవసరాల కోసం కృష్ణానదిపై మరికొన్ని కొత్త వంతెనల నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. కాగా, తుది దశకు చేరిన సీడ్ యాక్సిస్ రోడ్డు పనులతో పాటు, నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

