దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థి నిరసన ప్రదర్శనలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ పన్నిన ఒక భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. అమృత్సర్ కమిషనరేట్ పోలీసులు సరిహద్దు దాటి పనిచేస్తున్న రెండు విభిన్న ఉగ్ర ముఠాలను చేధించి, నలుగురు మైనర్లు సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 3 అక్రమ తుపాకులు, 4 పెట్రోల్ బాటిల్ బాంబులు మరియు 9 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : వైసీపీ లో బోరుగడ్డ తిరుగుబాటు..కారణం అదేనా..?
పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ హ్యాండ్లర్లు స్థానిక యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లోకి లాగేందుకు ఈ నెట్వర్క్ ను వాడుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులలో ఎనిమిది మంది వ్యక్తులు ఇప్పటికే జంతర్ మంతర్ నిరసన స్థలానికి చేరుకుని, అక్కడ స్థానిక సహచరుల నుండి పెట్రోల్ బాంబులతో కూడిన లాజిస్టికల్ మద్దతును కూడా పొందినట్లు అధికారులు గుర్తించారు. అక్కడ విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్ సిబ్బంది, ఇతర భద్రతా ఏజెన్సీలు మరియు యూనిఫామ్ ధరించిన అధికారులపై పెట్రోల్ బాంబులతో దాడులు జరపడమే వీరి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తించారు.
Also Read : అమరావతికి బిగ్ బూస్ట్.. సీఆర్డీఏ సంచలన నిర్ణయం..!
అయితే, జంతర్ మంతర్ మరియు పార్లమెంట్ పరిసర ప్రాంతాలలో ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసిన అత్యంత కఠినమైన నిఘా, పటిష్టమైన తనిఖీలు మరియు భారీ భద్రతా వలయం కారణంగా ఉగ్రవాదులు తమ ప్లాన్ను అమలు చేయలేకపోయారని జాతీయ మీడియా పేర్కొంది. దాడి ప్రయత్నం విఫలం కావడంతో ఈ ముఠా తిరిగి అమృత్సర్కు చేరుకోగా, పక్కా సమాచారంతో పంజాబ్ పోలీసులు రాజసాన్సి ప్రాంతంలో వీరిని పట్టుకున్నారు. ఈ ముఠాకు అందిన అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు, వారి నెట్వర్క్ మరియు నిరసన స్థలాల్లో వారు జరిపిన నిఘా కార్యకలాపాలపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

