అమెరికా సాఫ్ట్వేర్ రంగంలో దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ సంక్షోభం ముంచుకొస్తోంది. అక్కడి టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం తలనొప్పిగా మారింది. గత నెలలో టెక్ దిగ్గజం ఒరాకిల్ ఒకేసారి 30,000 మంది ఉద్యోగులను తొలగించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ తొలగింపుల్లో అత్యధిక శాతం భారతీయులే ఉండటం, అందులోనూ హెచ్-1బీ వీసాపై ఉన్నవారు ఎక్కువగా ఉండటంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.
Also Read : బ్రేకింగ్ : టీడీపీ ‘మహానాడు’ వేదిక మార్పు..!
మార్చి 31న ఈ ప్రకటన వెలువడటంతో, బాధితులందరికీ ఇప్పుడు డెడ్ లైన్ ముంచుకొస్తోంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, హెచ్-1బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోతే, ఆ దేశంలో చట్టబద్ధంగా ఉండటానికి కేవలం 60 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఈ 60 రోజుల్లోగా మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించి, వీసాను ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. లేదంటే ఆ గడువు ముగిసిన వెంటనే సామాన్లు సర్దుకుని స్వదేశానికి వచ్చేయాల్సిందే. ఏప్రిల్ నెల గడిచిపోతుండటంతో, ఒరాకిల్ మాజీ ఉద్యోగులకు మరో నాలుగు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఈ తక్కువ సమయంలో కొత్త ఉద్యోగం దొరకడం అనేది ఇప్పుడు ప్రహసనంగా మారింది. అసలు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఒరాకిల్ బాటలోనే ఇతర గూగుల్, అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తే పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ అన్ని కంపెనీలు ఇలాగే ఉద్యోగులను తొలగిస్తూ పోతే, మార్కెట్లో కొత్త ఉద్యోగాల లభ్యత పడిపోతుంది. వేలాది మంది టాలెంటెడ్ ఇంజనీర్లు ఒకేసారి ఉద్యోగాల కోసం పోటీ పడటం వల్ల గ్రేస్ పీరియడ్ లోపు అవకాశం దక్కడం అసాధ్యం అవుతుంది.
Also Read : దావూద్ దొరుకుతాడా..? అసలు ఎవరీ సలీం డోలా..?
ఇది కేవలం ఉద్యోగం పోవడం మాత్రమే కాదు, అమెరికాలో భారతీయులు దశాబ్దాలుగా కన్న కలలు కూలిపోవడం కూడా. ఈ అనిశ్చితి వల్ల చాలా మంది భారతీయులు ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికాలో ఉంటూ నిరంతరం వీసా టెన్షన్ పడటం కంటే, వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఐటీ రంగంలో స్థిరపడటం మేలని భావిస్తున్నారు. ఒకవేళ అమెరికా తన వీసా నిబంధనలను సడలించకపోతే, రాబోయే రోజుల్లో ఆ దేశం తన మేధో సంపత్తిని భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

