తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు వేదికపై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభ వేదికను శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో జరగాల్సిన ఈ కార్యక్రమం అకస్మాత్తుగా దక్షిణ కోస్తాకు మారడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముందుగా మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే, తాజాగా మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా నెల్లూరు జిల్లాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : పట్టాలెక్కిన మెగా 158..ఫుల్ మాస్ యాక్షన్..!
జూన్ లేదా జూలై నెలల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఒకే ప్రాంతంలో తక్కువ కాల వ్యవధిలో రెండు భారీ రాజకీయ సభలు నిర్వహించడం కంటే, భౌగోళికంగా వేర్వేరు ప్రాంతాలను కవర్ చేయడం వ్యూహాత్మకమని భావించిన పార్టీ అధిష్టానం ఈ మార్పు చేసినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టును మరింత బలోపేతం చేయడంతో పాటు, ఆ ప్రాంత కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఈ మహానాడు వేదిక దోహదపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
Also Read : ఏపీ సచివాలయంలో వైసీపీ ధురంధర్లు..!
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ మహానాడులో.. రాబోయే ఎన్నికల వ్యూహాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. వేదిక మార్పుపై స్పష్టత రావడంతో నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు సన్నాహక పనుల్లో నిమగ్నమయ్యారు. లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేదిక మార్పు వెనుక ఉన్న అసలు కారణాలు, అధికారిక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది.

