అంతర్జాతీయ ఆయుధ వ్యాపారంలో ఒక భారీ నెట్వర్క్ ను అమెరికా ఎఫ్బీఐ ఛేదించింది. ఇరాన్ ప్రభుత్వం తరపున రహస్యంగా ఆయుధ ఒప్పందాలు కుదుర్చుతున్న ఆరోపణలపై ఇరాన్ సంతతికి చెందిన అమెరికా శాశ్వత నివాసి షమీమ్ మాఫీ అనే 44 ఏళ్ళ మహిళను.. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి అధికారులు అరెస్ట్ చేశారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆమెపై మోపబడిన అభియోగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
Also Read : ఏపీకి మోదీ సర్కార్ వరాలు..!
షమీమ్ మాఫీ, ఒమన్ లో రిజిస్టర్ అయిన అట్లాస్ ఇంటర్నేషనల్ బిజినెస్ అనే బినామీ కంపెనీని ఉపయోగించి ఈ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు ప్రాసిక్యూటర్లు గుర్తించారు. 2023 నుండి తీవ్ర అంతర్యుద్ధంతో నలుగుతున్న సూడాన్ కు సాయుధ డ్రోన్లు, బాంబు ఫ్యూజులు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని సరఫరా చేయడానికి ఆమె మధ్యవర్తిత్వం వహించినట్లు ఆధారాలు లభించాయి. ప్రాసిక్యూటర్లు కోర్టులో సమర్పించిన వివరాల ప్రకారం.. ఇరాన్ సైనిక శ్రేణికి చెందిన శక్తివంతమైన మొహాజెర్-6 సాయుధ డ్రోన్ల కోసం ఏకంగా 70 మిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో సుమారు రూ. 580 కోట్లు ఒప్పందాన్ని ఆమె కుదిర్చింది.
Also Read : టార్గెట్ ధర్మాన, బొత్స.. పాచిక ఫలిస్తుందా..?
వీటితో పాటు 55,000 బాంబు ఫ్యూజులను సూడాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు చేరవేయడంలో ఆమె కీలక పాత్ర పోషించిందని గుర్తించారు. ఇరాన్ నిఘా మరియు భద్రతా మంత్రిత్వ శాఖతో ఆమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఫోన్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం ఆయుధాల బ్రోకరింగ్ చేయడానికి ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ, షమీమ్ మాఫీ 2022 నుండి 2025 వరకు ఈ అక్రమ కార్యకలాపాలను కొనసాగించారు. కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం ఆమెపై తీవ్రమైన నేరారోపణలు మోపింది. ప్రస్తుతం ఆమె అరెస్ట్ తో ఇరాన్ వెనుక ఉండి నడిపిస్తున్న ఆయుధ సరఫరా నెట్వర్క్ గుట్టు రట్టయింది.

